ఆంధ్రప్రదేశ్లో సచివాలయం వాలంటీర్లు గందరగోళంలో పడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో అవకాశం తగ్గడంతో చాలామంది వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల పోటీపడి పనిచేశారు. ఎన్నికల సమయం దగ్గర పడటంతో ప్రజల్లో మార్పు గమనించి కొంతమంది వైఖరి మార్చుకున్నారు. మరికొందరు మాత్రం పాత పద్ధతిలోని కొనసాగిపోయారు.
ఎన్నికల సమయంలో వాలంటీర్ల మీద తెలుగుదేశం జనసేన మొదట్లో కొన్ని ఆరోపణలు చేశాయి కానీ తర్వాత కాలంలో నిదానించుకుని ఆ ఆరోపణలు వెనక్కి తీసుకున్నాయి. కావాలంటే అలా వ్యవస్థను కొనసాగిస్తామని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వాలంటీర్ల గౌరవ వేతనం 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
ఈ పరిస్థితిని గమనించిన కొందరు వైసిపి అప్పటి ఎమ్మెల్యేలు వాలంటీర్ల మీద ఒత్తిడి చేశారు. వాలంటీర్ సేవలకు రాజీనామా చేసి తమతోపాటు తమతోపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని బలవంతం చేశారు ఆ ట్రాప్ లో పడిపోయిన వాలంటీర్లు అందరూ ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు.
ఎన్నికలకు ముందు సుమారు లక్ష మందికి పైగా వాలంటీర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వారిలో చాలామంది వైసీపీకి, వైఎస్ జగన్ తరుఫున ప్రచారం చేశారు. అయితే ఊహించిన విధంగా ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలయ్యింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో రాజీనామా చేసిన వలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
వలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటుగా, గౌరవ వేతనం పదివేలకు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చింది. అలాగే ఎన్నికల్లో గెలిచిన తర్వాత వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ చెప్తోంది. దీంతో ఇప్పటికే వలంటీర్లుగా పనిచేస్తున్నవారు తమను ఉంచుతారో ఉంచరో అని టెన్షన్లో ఉండగా.. ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వలంటీర్ల బాధ మరో రకంగా ఉంది.
రాజీనామా చేసిన వాలంటీర్లు ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు తాజాగా ఉత్తరాంధ్ర వాలంటీర్లు సీనియర్ మంత్రి అచ్చం నాయుడు ని ఆశ్రయించారు. దీనికి మంత్రి రివర్స్ లో కౌంటర్ ఇచ్చారు. ఒత్తిడి చేసి రాజీనామా చేయించిన వైసీపీ నాయకుల మీద పోలీసు ఫిర్యాదు ఇవ్వాలని ఆ తర్వాతే తాము స్పందిస్తామని ఆయన అన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నేతల మీద వాలంటీర్లే తిరగబడి పోలీస్ కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి నెలకొంది.
ఈ సందర్భంగా నెల్లూరులో వైసీపీ నాయకులపై వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి నెల్లూరు జిల్లా చిన్నబజారు పోలీసు స్టేషన్లోనూ మరికొందరు వాలంటీర్లు స్థానిక కార్పొరేటర్, వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు బలవంతంగా రాజీనామా చేయించారని వేదాయపాలెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రత్యేకంగా మీటింగ్ పేరు చెప్పి రాజీనామా చేయించారని ఆరోపించారు.
అనేక చోట్ల వాలంటీర్లు రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేపట్టారు . వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం లక్ష 25 వేల మంది వలంటీర్లను నియమించి వారితో పలు సామాజిక పింఛన్ల పంపిణీతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించి వారికి గౌరవ వేతనం అందిస్తూ వచ్చింది. ఇందులో సగం మంది సేఫ్ గా ఉండగా మరో సగం మంది అడ్డంగా బుక్ అయిపోయారు.
మరోవంక, రాజీనామా చేసిన వలంటీర్ల పోస్టులు తమకు ఇప్పించాలంటూ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల నుంచి కూడా నాయకులపై ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తుంది. వలంటీర్ల కోసం ప్రత్యేకంగా మంత్రిని నియమించడంతో పాటుగా, గౌరవ వేతనాన్ని పదివేలకు పెంచుతారన్న వార్తల మధ్య ఉన్న ఉద్యోగం నిలుపుకోవడానికి ప్రస్తుత వలంటీర్లు, రాజీనామా చేసి పోగొట్టుకున్నదాన్ని మళ్లీ పొందేందుకు పాత వలంటీర్లు.. తమకు వాలంటీర్ పదవులు ఇవ్వాలంటూ అధికార పార్టీల కార్యకర్తలు.. మధ్య ప్రభుత్వ వైఖరి ఆసక్తికరంగా మారనుంది.
దీని మీద తెలుగుదేశం ప్రభుత్వం కొంత క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం పనిచేస్తున్న వలంటీర్లను కొనసాగిస్తామని రాష్ట్ర సచివాలయాలు, వలంటీర్ల శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వెల్లడించారు. వైసిపి నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని, తమ జీవితాలతో ఆడుకున్నారని వలంటీర్లు తన ఫోన్కు వాట్సప్ మెసేజ్లు పంపించారని చెప్పారు.
వలంటీర్లతో ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేస్తామని పేర్కొంటూ వచ్చే ఒకటో తేదీన పింఛనుదారులకు రూ.7 వేలను వారి ఇంటి వద్దే అందిస్తామని తెలిపారు. అయితే, రాజీనామాలు చేయకుండా ఉద్యోగంలో ఉన్న వాలంటీర్లతో మాత్రమే పని చేయించుకుంటామని, ఉద్యోగాలకు రాజీనామా చేసిన వలంటీర్లను తిరిగి తీసుకోమని మంత్రి స్పష్టం చేశారు.
మొత్తం మీద పరిస్థితిని గమనించినట్లయితే రాజీనామా చేసిన వాలంటీర్లు పూర్తిగా ఇరుక్కునిపోయారని అర్థం అవుతుంది. ఇప్పటికే వాలంటీర్ల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తుండడంతో ఇదే అదనుగా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ష మంది వాలంటీర్ల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.