తెలంగాణలోని ఆదిలాబాద్ లో సోనాల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్థులు నిరసన చేపట్టారు. గత శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ 2018లో ఆదిలాబాద్ సభలో సొనాల, సాత్నాల గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేస్తాం అని ప్రకటించారు, కానీ మండల ఏర్పాటు ఇంకా జరగలేదు. ఎన్నో రోజుల నుంచి మండల ఏర్పాటు అవుతుందని ఎదురుచూస్తోన్న సొనాల ప్రజలు, ఇటీవల మండలాల ప్రకటనలో సొనాలను మండలంగా ప్రకటిస్తారని అనుకున్నారు, కానీ అప్పుడు కూడా మొండి చెయ్యి చూపించారు. అది కాస్త జరగకపోవడంతో నిరాశ చెందారు. దీంతో సొనాల గ్రామ ప్రజలు ఆందోళన బాట పట్టారు. మూడు రోజులుగా అంతర్ రాష్ట్ర రహదారి దిగ్బంధం చేస్తూ వర్షంలో కూడా నిరసన తెలియజేస్తున్నారు.
మండలంగా మార్చడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నా.. ఎందుకు మండలంగా చేయడం లేదని ప్రజలు గొంతెత్తారు. తెలంగాణ ఉద్యమంలో వంట వార్పు తరహా సొనాల గ్రామంలో వంట వార్పు చేస్తూ నిరసన తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సొనాల గ్రామ ప్రజలు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.