మహిళా చైతన్యం తీసుకుని వచ్చేందుకు విద్యా భారతి చొరవ చూపుతోందని ఇందులో భాగంగా సప్తశక్తి సంగం అనే పేరుతో కొత్త కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యాభారతి దక్షిణ భారత క్షేత్ర అధ్యక్షులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వర రావు తెలిపారు. సుమారు 76 లక్షల మంది మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించే అద్భుతమైన కార్యక్రమం అని వివరించారు. ఈ కార్యక్రమాన్ని రాణి దుర్గావతి జయంతి సందర్భంగా.. అక్టోబర్ 5 నుంచి మొదలు పెట్టామని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23 వరకు జరుపుతామని.. ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న 24 వేల విద్యా భారతి విద్యాలయాలతో పాటు.. మన రాష్ట్రంలో ఉన్న 225 విద్యాలయాల్లో మాతృ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
సప్తశక్తి సంగం గురించి వివిధ దశలలో కార్యాచరణ జరుగుతోందని వివరించారు. విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ద్వారా ‘మహిళల యొక్క’,’మహిళల కొరకు’,’మహిళల ద్వారా’ నప్తశక్తి సంగం గొప్ప చైతన్యం తీసుకొస్తుందని వివరించారు .
ఈ కార్యక్రమం ద్వారా 15 వేల సప్త శక్తి సంగం కార్యక్రమాల యోజన ద్వారా 76 లక్షల మహిళల భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. పదివేల మంది మహిళా కార్యకర్తల జాబితా తయారవుతున్నదని.. 800 శిక్షితులైన మహిళా వక్తలు తయారవుతారని వివరించారు. 50 లక్షల కర పత్రాలు సమాజంలోకి వెళతాయని.. భారతీయ ఆలోచన ఇంటింటికి వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతిమంగా 3.5 కోట్ల కుటుంబాలతో సంపర్కం ఏర్పడుతున్నదని.. సిద్ధాంతం గురించి అవగాహన ఏర్పడుతుందని.. వివరించారు. స్వదేశీ వస్తువుల ఉత్పత్తి మరియు విక్రయం పెరుగుతుందని వివరించారు.
సప్తశక్తి సంగం ప్రారంభిస్తున్న సందర్భంగా.. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో ఉమా మహేశ్వరరావుతో పాటు.. అఖిల భారతీయ ప్రచార ప్రభారీ లింగం సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాభారతి ప్రత్యేకత, ప్రాధాన్యతను వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో శిశు మందిర్ ల ద్వారా ప్రభావవంతమైన నాణ్యమైన విద్యా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అనఘా వెంకట లక్ష్మి మాట్లాడుతూ.. సప్తశక్తి సంగం ప్రణాళిక ను తెలియచేశారు. తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పూర్తిగా మహిళల భాగస్వామ్యంతోనే కార్యక్రమాలు జరుగుతాయని.. రాష్ట్రమంతటా అన్ని శిశుమందిర్ లలో ఆచార్యులు, మాతాజీలు పాల్గొంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంఘటనా మంత్రి పతకమూరి శ్రీనివాస్, రాష్ట్ర శిశు వాటిక ప్రముఖ్ కొత్తపల్లి ఉమ పాల్గొన్నారు.