వీళ్లు మారరు!
హింసను ప్రేరేపించడం, దేశాన్ని కించపరచడం, పరాయి దేశాలను ప్రేమించడం, అసత్యాలు అర్ధసత్యాలతో ప్రజలను, రైతులను ప్రేరేపించడం, అశాంతిని, క్రమశిక్షణ రాహిత్యాన్ని పెంచి పోషించడం.. ఈ దేశంలోని చాలా చాలా రాజకీయ పార్టీల నాయకులు అనేకులు చేస్తున్న దుర్మార్గం ఇదే. ప్రతిపక్ష నేతలందరూ ఇలాంటి వారే కాదు. కానీ ఎక్కువ మంది ఇలాంటి వారే. రైతు ఉద్యమం పేరుతో అరాచకం, అశాంతి ప్రజ్వరిల్లడానికి, కొన్ని ప్రతిపక్షాల మతిలేని మాటలు చేతలు కూడా కారణమయ్యాయనే ఆరోపణలున్నాయి. అయినా సరే, తప్పు సరిదిద్దుకుని క్రమశిక్షణ, బాధ్యతగల ప్రతిపక్షాలుగా ప్రవర్తించాలనే సోయి లేనట్టుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని అనేక రాజకీయ పార్టీలు నిర్ణయించాయి. అంటే, ఢిల్లీలో అల్లర్లకు పాల్పడిన వారిని షూట్ చేయలేదని విపక్షాలు తప్పు పడుతున్నాయా? లేక అరాచకాలుచేసిన వారిమీద కేసులు ఎందుకు పెట్టారని ప్రభుత్వాన్ని ఈ విపక్ష నేతలు తప్పు పడుతున్నారా? అసలు ఎందుకు నిరసన? ఎవరిమీద నిరసన? ఎందుకింతటి బాధ్యతా రాహిత్యం అని ఈ దేశ ప్రజల సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.
రైతుల ఉద్యమంలో రైతులు ఎందరు అంటే నేతి బీరలో నెయ్య అంత అనాల్సి ఉంటుందేమో. గుప్పెడు మంది రైతులు, వేల మంది ఇతరులు కలిసి ఢిల్లీ శివార్లలో తిష్టవేయడం, ట్రాక్టర్ల ర్యాలీపేరుతో అరాచకం చేయడం అన్నీ ప్రతిపక్షనేతల కనుసన్నల్లోనే జరిగాయని అనుకోవాలా? బాధ్యతలేని విపక్షం పరోక్షంగా అగ్నికి ఆజ్యం పోసిందని ప్రభుత్వ పెద్దలు అంటే మాత్రం తప్పేంటి? ఢిల్లీ శివార్లలో హైవేలను ఆక్రమించి రైతుల పేరుతో నాటకం రెండు నెలలుగా నడుస్తోంది. నిజంగా రైతులే ఆందోళన చేస్తే అది నాటకం కాదు. కానీ రైతులు కొందరే. కాని వారు ఎందరో. చివరకు అన్య మతస్తులు సిక్కుల్లా తలపాగాలు పెట్టుకుని గుంపులో చొరబడ్డారు. రిపబ్లిక్ డే నాడు రైతుల పేరుతో అరాచకం జరిగింది. వందల మంది పోలీసులు గాయపడ్డారు. ఎర్రకోటపై వేరే జెండా ఎగురవేసి జాతి పరువు తీశారు. దీప్ సిద్ధూ తదితరులు ఉద్దేశపూర్వకంగా అల్లర్లు చేయించారని కేసు నమోదైంది. ఇంత జరిగిన తర్వాత, ఇన్నాళ్లూ ఈ నాటకానికి వంత పాడిన రాజకీయ నాయకులు నీతులు వల్లిస్తున్నారు. హింస వద్దు. శాంతి ముద్దు అని డైలాగులు చెప్తున్నారు. రాహుల్ గాంధీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ వరకూ వీళ్లందరూ ఇప్పుడు శాంతికి బ్రాండ్ అంబాసిడర్లుగా పోజు కొడుతున్నారు.