నారాయణపేట జిల్లా కలెక్టర్ పై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ గారికి విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారిని పలుమార్లు అపాయింట్మెంట్ కోరినా స్పందించకపోయిన విషయాన్ని కూడా ప్రస్తావించింది.
జాతీయ జెండాను అవమానపరిచిన ప్రభుత్వ ఉద్యోగి ప్రవర్తనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన విశ్వహిందూ పరిషత్ నాయకులపై నారాయణపేట జిల్లా కలెక్టర్ దురుసుగా ప్రవర్తించి.. అమర్యాదగా మాట్లాడిన తీరును తప్పుపడుతూ డి ఓ పి టి కి ఫిర్యాదు చేశారు. గత జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే రోజు నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూజ చేసే విషయంలో.. మరియు జాతీయ జెండా ఆవిష్కరణ చేసే విషయంలో అంగన్వాడీ టీచర్ ఎస్తేర్ ప్రవర్తన భారత జాతి వ్యతిరేకతకు నిదర్శనంగా ఉండింది. ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్దామని .. జనవరి 27వ తేదీన విశ్వహిందూ పరిషత్ నేతలు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. దీంతో కలెక్టర్ స్థాయిని మరిచి దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించారు. హుందాతనం కోల్పోయి వ్యవహరించారు. ఇదే విషయాన్ని చెబుదామని జనవరి 28వ తేదీ నుంచి తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారికి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. వారి పర్సనల్ మొబైల్ కు, మరియు ఆఫీస్ సిబ్బందికి చాలాసార్లు విన్నవించినా రెస్పాండ్ కాలేదు. “మేడం బిజీ ఉన్నారు.. మేడం బిజీ ఉన్నారు..” అని ఒకే సమాధానం లభించింది. దాదాపు నాలుగు నెలల నుంచి ఈరోజు వరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ నుంచి రెస్పాండ్ రావడం లేదు. అయినప్పటికీ ఫిబ్రవరి 27వ తేదీన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారికి నారాయణపేట కలెక్టర్ గురించి ఫిర్యాదును మెయిల్ ద్వారా పంపాము. అయినప్పటికీ కలెక్టర్ పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, విశ్వహిందూ పరిషత్ కు కనీస స్పందన తెలియజేయలేదు. దీంతో చేసేది లేక కలెక్టర్ వ్యవహరించిన తీరు తో పాటు, విశ్వహిందూ పరిషత్ కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అపాయింట్మెంట్ ఇవ్వని చీఫ్ సెక్రటరీ విషయమై కేంద్ర ప్రభుత్వ డి ఓ పి టి మంత్రికి ఫిర్యాదు చేశాము.
ప్రజల కోసం పని చేయాల్సిన అధికారులు ప్రజలను ఇబ్బందుల పాలు చేయడం ఏమాత్రం తగదు. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం కూడాను.! అధికారులు..పాలకులు ప్రజల కోసమే పని చేయాల్సి ఉంది. కానీ ఉద్యోగ ధర్మం విస్మరించడం ఏమాత్రం తగదు. స్థాయికి తగ్గట్టు వ్యవహరిస్తేనే అధికారులపై ప్రజలకు భరోసా, గౌరవం కలుగుతుందని కలెక్టర్ పై ఫిర్యాదు చేసిన విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి, ప్రచార ప్రముఖ్ శ్రీ సురేందర్ రెడ్డి గారు, శ్రీ పండరీనాథ్ గారు, పగుడాకుల బాలస్వామి పేర్కొన్నారు. అధికారి ఏ స్థాయిలో ఉన్నా రాజ్యాంగానికి లోబడి పని చేయాలి తప్ప.. రాజ్యాంగాన్ని అతిక్రమించడం సరికాదు అని వారు హితవు పలికారు.