ఉపరాష్ట్రపతి, రాజ్యసభ వెంకయ్య నాయుడు కు ప్రధాని మోదీ నిన్న వీడ్కోలు పలికారు. పార్లమెంట్ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో నిన్న సాయంత్రం వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. వెంకయ్య నాయుడు స్ఫూర్తి ప్రదాత అని.. ఆయన మార్గదర్శనంలో సుదీర్ఘకాలం సన్నిహితంగా పనిచేసే అవకాశం తనకు లభించడం గర్వంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తాను కార్యకర్తగా ఉన్నప్పటి నుంచీ వెంకయ్య నాయుడుతో ఆత్మీయ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పరిష్కారంతో ముందుండేవారని, పార్టీ విషయంలోనైనా.. ప్రభుత్వ పరంగానూ ఆయన చేసిన సూచనలు తనకు మార్గదర్శనం చేశాయని తెలిపారు. ధర్మం, కర్తవ్య నిర్వహణే లక్ష్యంగా ఆయన తన భావితరాలకు మార్గదర్శనం చేశారని ప్రశంసించారు. దేశం కోసం, పార్లమెంటరీ వ్యవస్థ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషికి ప్రధానమంత్రిగా పార్లమెంట్ సభ్యులందరి తరపునా ధన్యవాదాలు చెబుతున్నానని ప్రకటించారు. కరోనా సమయంలోనూ తన రాజకీయ జీవితంలో తారసపడిన దాదాపు ప్రతి ఒక్కరికీ ఉపరాష్ట్రపతి ఫోన్ చేసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారని.. ఇది అసలైన ప్రజానాయకుడి లక్షణమని ప్రధాని పేర్కొన్నారు. మాటల మాంత్రికుడిగా పేరు పొందిన వెంకయ్య ప్రయోగించే పదజాలం, ఏక వాక్య ప్రయోగాలు, ప్రేరణాత్మక వాక్యాలు తమకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనని మోదీ పేర్కొన్నారు. ఆయన భాషా నైపుణ్యం గొప్పదని చెప్పారు. మాతృభాషల పరిరక్షణ కోసం ఉపరాష్ట్రపతి చేసిన కృషిని ముందుకు తీసుకెళ్లేందుకు మనమంతా కష్టపడతామని ఆయన చెప్పారు. సమావేశంలో మంత్రి ప్రహ్లాద్ జోషి, పురుషోత్తమ్ రూపాలా, రాందాస్ అథవాలే, రాజ్యసభ డిప్యుటీ చైర్మన్ హరివంశ్ సహా పలువురు సభ్యులు వెంకయ్య నాయుడు అందించిన సేవలను ప్రశంసించారు.