ఉపరాష్ట్రపతిగా మళ్లీ వెంకయ్యపేరునే బీజేపీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. దక్షిణాదిలో విస్తరణపై దృష్టిపెట్టిన నేపథ్యంలో ఇక్కడివారికే మరోసారి అవకాశం ఇవ్వాలని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వెంకయ్యను తిరిగి కొనసాగించడం లేదా తమిళనాడుకు చెందిన తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అవకాశం ఇవ్వడం గురించి ఆలోచిస్తున్నార్ట. ముక్తార్ అబ్బాస్ నక్వీ పేరు ముందు నుంచి వినిపిస్తున్నా ఆయన ఉత్తరాది నేత.
వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఒకట్రెండు రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశమై తుది నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. బోర్డులో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సభ్యులుగా ఉన్నారు.
నక్వీతో పాటు పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, గుజరాత్ మాజీ సీఎం ఆనందిబెన్ పేర్లు సైతం ప్రచారంలో ఉన్నాయి. ఈ నెల 19న ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ల చివరి గడువు. ఏకగ్రీవం కుదరనిపక్షంలో ఆగస్టు 6న ఎన్నిక ఉంటుంది. పార్లమెంటు సభ్యులే ఓటర్లు. ఉభయసభల్లో ఎన్డీఏకే మెజారిటీ ఉండడంతో పాలక కూటమి అభ్యర్థి విజయం ఖాయమవుతుంది. ప్రస్తుత బలం 780 కాగా.. మెజారిటీ మార్కుకు 390 అవసరం. ఒక్క బీజేపీకే 394 మంది ఎంపీలు ఉన్నారు.