తమిళనాడు దివంగత సీఎం జయలలిత నివాసం వేదనిలయం ఆమె వారసులకే చెందుతుందని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బంగళాను జయ స్మారక కేంద్రంగా మారుస్తూ తమిళనాడు సర్కారు ఇచ్చిన ఆదేశాల్ని ధర్మాసనం రద్దు చేసింది. ఆమె వారసులైన మేనల్లుడు దీపక్, మేనకోడలు దీప కే ఆ ఇల్లు దక్కుతుందని ఆదేశాలిచ్చింది.
ఆళ్వార్ పేటలోని పొయెస్ గార్డెన్లో వేద నిలయంలో జయలలిత 40 ఏళ్లు నివసించారు. ఆ ఇంటిని జయ, ఆమె తల్లి వేదవతి కష్టార్జీతముతో కలిసి నిర్మించుకున్నారు. జయ మరణానంతరం దాన్ని స్మారకకేంద్రంగా మారుస్తామని అన్నాడీఎంకే సర్కారు స్వాధీనం చేసుకుంది. దీంతో ఆమె మేనల్లుడు, మేనకోడలు కోర్టును ఆశ్రయించారు.
జయలలిత చట్టబద్ధ వారసులైన వారికే వేదనిలయాన్ని అప్పగించాలని జిల్లా కలెక్టర్ ను కోర్టు ఆదేశించింది. జయలలిత చెల్లించవలసిన పన్నులు బాకీ ఉంటే, వాటి వసూలుకు తగిన చర్యలు తీసుకోవచ్చునని ఆదాయపు పన్ను శాఖకు సూచించింది. జయలలిత పేరుమీద రెండు స్మారకకేంద్రాలు ఎందుకని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.
24,322 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న వేద నిలయం…. తమిళనాడు రాజకీయాల్లో జరిగిన ముఖ్య ఘటనలకు వేదికైంది.