విప్లవ రచయితల సంఘం నేత వరవర రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావుకు సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్ మంజూరు చేసింది. భీమా కొరెగావ్ కేసులో బాంబే హైకోర్టు 2021 ఫిబ్రవరి 22న ఇచ్చిన ఆరు నెలల బెయిలును పర్మనెంట్ బెయిలుగా మార్చింది. అనారోగ్య కారణాలతో శాశ్వత బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో వరవరరావు వేసిన పిటిషన్ వేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారణ జరిపి తాజా తీర్పు వెల్లడించింది. అయితే ఇందులో కొన్ని షరతులను జోడించింది. గ్రేటర్ ముంబై దాటి ఎక్కడికి వెళ్లకూడదని నిబంధన విధించింది. కేసు దర్యాప్తును ఏ విధంగానూ ప్రభావితం చేయరాదని, సాక్షులతో సంప్రదింపులు జరపకూడదని కూడా ఆదేశించింది. చికిత్సకు సంబంధించిన వివరాలను ఎన్ఐఏకు తెలియజేయాలని వరవరరావును ఆదేశించింది.
ఈ బెయిల్ పిటిషన్ పై ఎన్ఐఏకు, వరవర రావు లాయర్ కు మధ్య వాదనలు జరిగాయి. అనారోగ్య కారణాలతో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ఎన్ఐఏ తరపు న్యాయవాది కోరారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. అందుకు ఆయనకు ఇచ్చిన డిశ్చార్జ్ సర్టిఫికెట్ సాక్ష్యమని ఎన్ఐఏ తరపు న్యాయవాది చెప్పారు. అయితే ఈ వాదనతో సుప్రీంకోర్టు విబేధించింది. అనారోగ్య కారణాలతో బెయిల్ ఇచ్చే అధికారం కోర్టుకు లేదా అని ప్రశ్నించింది. కాగా, ఇంకో పదేళ్లకు కూడా ఈ కేసు విచారణ పూర్తి కాదని వరవర రావు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఆయనపై మోపిన అభియోగాల్ని ఎన్ఐఏ నిరూపించలేకపోయిందని అన్నారు. దీంతో 82 ఏళ్ల వయసున్న వరవరరావు ఇప్పటికే రెండున్నరేళ్లపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడని తెలిపిన సుప్రీంకోర్టు.. షరతులతో కూడిన శాశ్వత మెడికల్ బెయిల్ ను మంజూరు చేసింది.