ఆ మధ్యన హైదరాబాద్ లో కుమారి ఆంటీ పేరుతో జరిగిన హడావిడి గుర్తుంది కదా. సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారడంతో ఆమె షాపుకి జనం పోటెత్తడం ఆ తర్వాత ట్రాఫిక్ అంతరాయం కలిగి చివరికి షాపుని వేరేచోటకు తరలించడం లాంటివి చోటు చేసుకొన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో అటువంటిదే మరో సంఘటన చోటు చేసుకొంది . మంగోల్ పురి ప్రాంతంలో చంద్రిక దీక్షిత్ అనే అమ్మాయి వడాపావు ఫుడ్ స్టాల్ నడిపిస్తోంది. మొదట్లో చిన్న ఫుడ్ స్టాల్ గా ఉన్నప్పటికీ, తర్వాత ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతూ వచ్చారు. రానురాను ఇన్ స్టా లో ఆమె కు ఫాలోవర్స్ అంతకంతకు పెరిగి, 30 లక్షలు దాటిపోయారు. మరోవైపు ఆమె నడిపే వడపావ్ సెంటర్ కి విపరీతంగా జనం వచ్చేస్తున్నారు. దీంతో చంద్రిక పేరు కాస్త వడ పావ్ గర్ల్ గా మారిపోయింది . ఆ షాపు దగ్గర విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈలోగా చంద్రిక తన ఇన్ స్టా లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు ఆమె ఫుడ్ స్టాల్ ని ఖాళీ చేయించే ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నాలు మీద ఆమె తిరగబడ్డారు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ క్రమంలో చంద్రిక ను అరెస్టు చేశారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు పోటెత్తాయి. దీనిమీద ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ చంద్రికను అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. మొత్తం మీద ఢిల్లీలో ఈ కొత్త కుమారి ఆంటీ బాగానే కలకలం రేపుతున్నారు.