కోవిడ్-19 వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదని…అయితే టీకాలు తీసుకోవడం ఇష్టంలేని వాళ్లు ఇంట్లోనే ఉండాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. కోవిడ్-19 టీకా తీసుకోనివారు ఇంటి బయట కాలుపెట్టొద్దని, ఎలాంటి కార్యక్రమాలు, సమావేశాలకు హాజరుకావద్దనీ అన్నారు. కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లలోకి అస్సలు వెళ్లొద్దని సీఎం అన్నారు.
అసోంలో ఎక్కడికెళ్లినా కోవిడ్ -19 టీకా ధృవీకరణ పత్రాన్ని చూపించాల్సిందే. ఇష్టారీతిన ఉంటామంటే అనుమతించబోం అని గట్టిహెచ్చరికే చేశారు హిమంత. గువాహటిలో దాదాపు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తైంది. అసోం ప్రభుత్వ గణాంకాల ప్రకారం, జనవరి 16 వరకు రాష్ట్రం 3.98 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించింది. వీటిలో 1.69 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు రెండు డోసుల వ్యాక్సిన్లను తీసుకున్నారు.