సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ఎంపికయ్యారు. తన వారసుడిగా జస్టిస్ లలిత్ పేరును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. ఉదయం ఆయనకు సిఫార్సు కాపీని అందజేశారు. సీజేఐ రమణ ఆగస్టు 26న పదవీ విరమణ చేయనున్నన్నారు.. తన తర్వాతి ప్రధాన న్యాయమూర్తి పేరును సిఫారసు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న సీజేఐకి లేఖ రాశారు.
జస్టిస్ లలిత్ ఆగస్టు 27న భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు కేవలం 74 రోజుల పదవీకాలం మాత్రమే ఉంది. ఆయన ఇదే ఏడాది నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత జస్టిస్ డివై చంద్రచూడ్ భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. ప్రస్తుతం యూయూ లలిత్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. 2014, ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. న్యాయమూర్తి కంటే ముందు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జస్టిస్ లలిత్ సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన 6వ సీనియర్ న్యాయవాది.