ఇస్లాంకు ద్రోహం చేసిన బీజేపీకి మద్దతిచ్చిన కాఫిర్లు మీరంటూ ఓ ముస్లిం కుటుంబంపై ఇరుగుపొరుగువారే దాడి చేసిన ఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది. రుద్రాపూర్లో ముస్లింలు అధికంగా జీవించే ఉథంసింగ్ నగర్ కు చెందిన అనీస్ మియాన్, అతనికుటుంబసభ్యులపై స్థానికులే భౌతికదాడికి దిగారు. మొన్నటి ఎన్నికల్లో ఆ కుటుంబం మొత్తం బీజేపీకి మద్దతిచ్చింది. దీంతో ఇస్లాంకు ద్రోహం చేశారంటూ, కాఫిర్లంటూ ఇంటిమీదకెళ్లి పిల్లాపాపలు సహా అందరిపై మూకుమ్మడిగా దాడిచేసి కొట్టారు. బాలిక సహా కుటుంబంలోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదులో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరొకరికోసం గాలిస్తున్నారు. వార్డ్ నెం.20 భూర్బంగ్లా నివాసి అయిన అనీస్ మియాన్ బీజేపీ మద్దతుదారు. ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వడమే కాక ఆ ప్రాంతంలోని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అందరి ఇళ్లకూ వెళ్లి బీజేపికి ఓటేయమని అభ్యర్థించాడు. దీంతో స్థానికులు అతనిపై ఆగ్రహంగా ఉన్నారు.
ఈనేపథ్యంలో ఏప్రిల్ 5న మియాన్ తన దుకాణంలో ఉన్నసమయంలో దాడి చేశారు. పక్కనే ఉంటున్న ఇంటిమీదకూ వచ్చి అందరినీ కొట్టారని అతని భార్య పర్వీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో వారి దగ్గర కత్తులు, కర్రలు ఉన్నాయని తమను కాఫిర్లంటూ ఇస్లాంకు ద్రోహం చేశారంటూ దుర్భాషాలాడని ఆమె వాపోయింది. తన భర్తను కర్రలతో కొట్టారని …కత్తితో తనపై దాడి యత్నం చేశారని ఆరోపించింది. అంతేకాదు తన చెవిపోగులు లాక్కుని వెళ్లారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త, తాను ఆస్పత్రికి వెళ్లినసమయంలో మళ్లీ వచ్చితన పిల్లలనూ బెదిరించి కొట్టారని…మీ తల్లిదండ్రులవంతు అయిపోయింది ఇప్పుడు మీవంతు అని దాడి చేశారని చెప్పింది బాధితురాలు.
బీజేపీ మద్దతుదార్లైన ముస్లింలపై దాడి ఇదేం మొదటిసారి కాదు… గత నెలలో యూపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినందుకు ఓ మహిళను అత్తామామలు ఇంటినుంచి గెంటేశారు. ట్రిపుల్ తలాక్ రద్దు, పేదలకు ఉచిత రేషన్ వంటి మంచి పథకాలు తెచ్చారని ఆమె బీజేపీకి ఓటేసింది. ఈవిషయం కుటుంబసభ్యులతో చెప్పి నోరుజారింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త, అత్తమామలు ఆమెను ఇంట్లోంచి గెంటేశారు. త్రిపుల్ తలాక్ నుంచి తనను తాను రక్షించుకోవాలని హెచ్చరిస్తూ కట్టుబట్టలతో గెంటించారు.