ఉత్తరప్రదేశ్లోని వీధుల్లో ఇక నమాజ్ ఉండదని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మతపరమైన ప్రదేశాల నుంచి వేలాది మైకులు, లౌడ్ స్పీకర్లను తొలగించామని, గతంలో లౌడ్ స్పీకర్ల శబ్దంతో ఇబ్బంది పడ్డ రాష్ట్రంలోని ప్రజలకు ఇది గొప్ప ఉపశమనమనీ అన్నారు. లౌడ్ స్పీకర్లను తొలగించడం ద్వారా అనవసరమైన శబ్దాన్ని ఎలా తొలగించామో ప్రజలు చూసారని అన్నారు. లక్నోలో జరిగిన భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రకటన చేశారు.
ఇటీవల ముగిసిన రంజాన్ సందర్భంగా, రాష్ట్రంలో రోడ్లపై ఎక్కడా నమాజ్ లేదని.. రామ నవమి, హనుమాన్ జయంతి తోపాటు
పలు పండుగను శాంతియుతంగా నిర్వహించామని యోగి పేర్కొన్నారు.
“నేడు ఉత్తరప్రదేశ్ అల్లర్లు లేని రాష్ట్రంగా ఉంది. ఉత్తరప్రదేశ్లోని ఈ కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో దాని మునుపటి పనులను తిరిగి ప్రారంభించింది. గత రెండు నెలల్లో మీరు గమనించి ఉండాలి. రామనవమి కార్యక్రమాలను శాంతియుతంగా జరుపుకుంటున్నాం. హనుమాన్ జయంతి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకుంటున్నాం. రంజాన్ మాసంలో నెల చివరి రోజున, ఉత్తరప్రదేశ్ వీధుల్లో అల్విదా నమాజ్ చేయకపోవడం ఉత్తరప్రదేశ్లో మొదటిసారిగా జరుగుతోంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వీధుల్లో నమాజ్ ఉండదు. నమాజ్ కోసం, వారి ప్రార్థనా స్థలమైన మసీదు లేదా ఈద్గాలో ఒక స్థిర స్థలం ఉంది. ధార్మిక కార్యక్రమాలు లేదా మతపరమైన కార్యక్రమాలు వారి స్థిర ప్రదేశాలలో మాత్రమే జరుగుతాయి, వీధుల్లో జరగవు. ఉత్తర ప్రదేశ్ లో వివిధ మత స్థలాలకు చెందిన 70000 మైక్లు, లౌడ్స్పీకర్లు ఆయా ప్రాంతాల సీనియర్ సిటిజన్లు, రోగులు, పిల్లలు అందరికీ ఇబ్బంది కలిగించేవి. వాటాన్నిటిని తొలగించాం” అని అన్నారు.