ఆదిత్యనాథ్ తిరిగిఅధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే దాదాపు 50మంది నేరస్థులు లొంగిపోయారు. దోపిడీదొంగలు, గో హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లు సహా రకరకాల నేరాలు చేసిన వాళ్లు అందులో ఉన్నారు. వారిలో చాలామంది ప్లకార్డులు పట్టుకుని స్టేషన్లకు వచ్చారు. నేను లొంగిపోతున్నా..దయచేసి నన్ను ఎన్ కౌంటర్ చేయవద్దు అని వాటిపై రాసిఉంది.
కిడ్నాప్, దోపిడీ ఆరోపణలతో పరారీలో ఉన్న గౌతమ్ సింగ్ లొంగుబాటులో ఇది మొదలైంది. మార్చి 15న గోండా జిల్లాలోని ఛాపియా పోలీస్ స్టేషన్లో అతను లొంగిపోగా..మూడురోజుల్లో మరో 23 మంది అదేబాట పట్టారు. ఒకేసారి వారంతా సహరాన్ పూర్లోని చిల్కానా పోలీసు స్టేషన్ కు స్వయంగా వచ్చి లొంగిపోయారు. ఒక్క పశ్చిమ ఉత్తరప్రదేశ్లోనే నలుగురు మద్యం స్మగ్లర్లు మళ్లీ నేరం చేయబోమని అఫిడవిట్తో దేవబంద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
దీని తర్వాత పొరుగున ఉన్న షామ్లీ జిల్లాలో నేరస్తుల సరెండర్లు మొదలయ్యాయి. 18 మంది గోహత్య నిందితులు ఠానా భవన్ ,గర్హిపుఖాటా పోలీస్ స్టేషన్లలో లొంగిపోయారు. కొద్ది రోజుల్లోనే మరో వాంటెడ్ క్రిమినల్ హిమాన్షు అలియాస్ హనీ ఫిరోజాబాద్లోని సిర్సాగంజ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. లొంగిపోయే సమయంలో, తనను కాల్చవద్దని పోలీసులను వేడుకుంటూ ప్లకార్డు పట్టుకుని ఉన్నాడు.
లొంగిపోయిన వాళ్లంతా ఇకనుంచి నేరాలు చేయబోమంటున్నారని లా అండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత కుమార్ తెలిపారు. అదే సమయంలో ఇద్దరు నేరస్థులు ఎన్ కౌంటర్లో చనిపోగా…మరో 10మందిని అరెస్ట్ చేశారు. శాంతిభద్రతలు మెరుగుపర్చేందుకు రాష్ట్రంలోని నేరస్థులందరిపైనా నిఘా వేశామని ఆయన తెలిపారు. నేరాల పట్ల జీరో టాలరెన్స్ అనేది మాఫియాపై సమర్థవంతమైన చర్య మాత్రమే కాదు, UP-112 ద్వారా తాజా జాగరణ మరియు ఇంటెన్సివ్ పెట్రోలింగ్ కూడా అని ఆయన అన్నారు.
పోలీసు, అగ్నిమాపక టెండర్లు ,అంబులెన్స్ల కోసం సమీకృత అత్యవసర సేవకోసం ‘UP 112’ ను అందుబాటులోకి తెచ్చారు. 100, 101 ,102 హెల్ప్లైన్ల ప్రత్యేక సేవలను అందుబాటులో ఉంచారు. 2017నుంచి రాష్ట్రంలో ఎలాంటి మతఅల్లర్లు కూడా జరగలేదు.