వేలాదిమంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అగ్రనాయకులు, దిగ్గజ పారిశ్రామిక వేత్తల మధ్య రెండోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు యోగీ ఆదిత్యనాథ్. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు,బీజేపీ పాలిత ముఖ్యమంత్రులూ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు.
లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఎకానా స్టేడియం ఇందుకు వేదిక అయింది. యోగీతో పాటు 47మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు పదవీప్రమాణం చేశారు.
తాజా ఎన్నికల్లో 255 సీట్లు గెలుచుకుంది బీజేపీ. మరోసారి ఎమ్మెల్యేలు యోగీనే శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు. తన నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ గవర్నర్ ను కలిశారు యోగీ.
ఇక తన ప్రమాణ స్వీకారానికి రావల్సిందిగా ముఖ్యులకు ఆహ్వానాలు పంపారు యోగీ. ప్రత్యర్థులు మాజీ ముఖ్యమంత్రులు అయిన ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, మాయావతిలకు స్వయంగా ఫోన్ చేసి పిలిచారు యోగి.