ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ ప్రాజెక్ట్ కింద ఉత్తరప్రదేశ్ ఈ-విధాన్ భవన్ పురోగతిని గురువారం పరిశీలించారు. ఈ పేపర్లెస్ డిజిటల్ అసెంబ్లీకి సంబంధించిన శిక్షణా మాడ్యూల్ను ఇవాళ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. అసెంబ్లీ కోసం కొత్త యాప్ను కూడా ప్రారంభించనున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కొత్త ఆధునిక పేపర్లెస్ అసెంబ్లీని స్వీకరించడానికి సిద్ధంగా ఉందని.. ఇది UN కాదు, ఇది UP కొత్త ఆధునిక పేపర్లెస్ అసెంబ్లీ” అని యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు ట్వీట్ చేశారు.
నివేదికల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నేషనల్ ఇ-విధాన్ అప్లికేషన్ ప్రాజెక్ట్ కింద అసెంబ్లీలోని 416 సీట్లపై టాబ్లెట్లను ఇన్స్టాల్ చేసింది. అసెంబ్లీలో 403 సీట్లు ఉన్నప్పటికీ , ఎమ్మెల్సీలు కూడా కొన్నిసార్లు సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా 416 ట్యాబ్లెట్లను అమర్చారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ‘ప్రభోధన్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన అసెంబ్లీ సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కొత్త డిజిటల్, పేపర్లెస్ సిస్టమ్తో స్నేహపూర్వకంగా ఉండటానికి అసెంబ్లీ సభ్యులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుంచి 30 మంది నిపుణులు మే 21న శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
మే 23న మొదటి అసెంబ్లీ సమావేశాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి అన్ని ఏర్పాట్లు చేసి, పరిశీలించగా.. కొత్త డిజిటల్ వ్యవస్థకు అలవాటు పడేందుకు సమయం తీసుకునే సభ్యుల కోసం తొలి సెషన్లలో పేపర్ పత్రాలను ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అంతకుముందు 2022, మార్చి 28న నాగాలాండ్ అసెంబ్లీ టాబ్లెట్లు, ఇ-బుక్స్ను ప్రొసీడింగ్ల కోసం ఉపయోగించిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. అసెంబ్లీలోని 60 మంది సభ్యులు సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించుకున్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున అసెంబ్లీలో ట్యాబ్లెట్లను అమర్చడం ఇదే తొలిసారి.