పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు గోవా దివంగత సీఎం మనోహర్ పరీకర్ కుమారుడు ఉత్పల్. తన తండ్రి పనాజీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీకోసం కష్టపడ్డారని ఉత్పల్ అన్నారు. ఫిబ్రవరి 14 ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్టు ఉత్పల్ ప్రకటించారు. తన తండ్రి మరణానంతరం వచ్చిన ఉప ఎన్నిక సందర్భంగా కూడా తాను టికెట్ ఆశించానని…కార్యకర్తలందరి మద్దతు తనకే ఉందని అన్నారు. అప్పుడు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని అన్నారు. ఈ సారైనా తనకు టికెట్ ఇస్తారని ఆశించానని ఎందుకు నిరాకరించిందో అర్థం కావడం లేదని ఉత్పల్ వ్యాఖ్యానించారు. పనాజీలో ఈసారి హోరాహోరీ ఉండబోతోందని అన్నారు.
40 స్థానాలకు సంబంధించి 34 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. పనాజీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అటానాసియో అలియాస్ బాబూష్ మాన్సెరాట్ ను అభ్యర్థిగా ప్రకటించారు. 2019 ఉప ఎన్నికలో కాంగ్రెస్ టిక్కెట్పై పనాజీ సీటును గెలుచుకున్న మాన్సెరాట్..గెలిచాక బీజేపీలో చేరారు.
“మనోహర్ పరీకర్ ఇరవయ్యేళ్లకు పైగా పనాజీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. పనాజీ ప్రజలతో ఆయనకి ఎంతో అనుబంధం. కేవలం పరికర్ పేరును చూసి కాక… ఆయన విలువలు నిబద్దత చూసి ఓట్లు వేశారు. ఆ విలువలే నేను పుణికిపుచ్చుకున్నా… తండ్రి పేరు నిలబెట్టేలా విలువలతో బతకాలనుకుంటున్నా. నిజాయితీ గల, విద్యావంతులైన ఓటర్లను నేను అభ్యర్థిస్తాను. పనాజీ ప్రజలకు మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది’అని ఆయన అన్నారు.
పనాజీలో పార్టీ అభ్యర్థి ఎంపిక తనతో పాటు, కార్యకర్తలను నిరాశపరిచిందని ఉత్పల్ అన్నారు. అంతేకాదు నేరచరిత్ర లేని వ్యక్తికి టికెట్ ఇచ్చినా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటానని…ఆ అభ్యర్థికోసం పనిచేస్తానని ఉత్పల్ వ్యాఖ్యానించారు.
అటు అభ్యర్థుల ప్రకటన తరువాత బీజేపీ గోవా ఎన్నికల ఇన్ చార్జ్ దేవేంద్ర ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడారు. పారికర్ కుటుంబం తమ కుటుంబం అని..ఉత్పల్ తమ మనిషి అని అన్నారు. అయితే ఉత్పల్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే దానిపై రెండు ఆప్షన్లు ఇచ్చామని…ఒకదాన్ని తిరస్కరించాడని…మరోదానిపై ఇంకా చర్చిస్తున్నామని అన్నారు. పరీకర్ కుటుంబం అంటే తమకెప్పటికీ గౌరవమేనని ఆయన అన్నారు. ఈ మాట అని రెండు రోజులైనా ఉత్పల్ తో ఫడ్నవిస్ కానీ, రాష్ట్ర పార్టీ ఎలాంటి చర్చలు జరపలేదని సమాచారం.
అటు పనాజీ టికెట్ ను బీజేపీ ఉత్పల్ కు నిరాకరించడంతో ఆప్ ఆయనకు టికెట్ ఆఫర్ చేసింది. ఆప్ ఆఫర్ ను తిరస్కరించిన ఉత్పల్ పనాజీ నుంచే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.