అల్ఖైదా చీఫ్ అల్-జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో డ్రోన్ దాడులు జరిపి జవహరీని అంతమొందిందినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. 2011, మే 2న అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామాబిన్ లాడెన్ హత్య తర్వాత ఇప్పుడు ఆ సంస్థ అగ్రనేత జవహరీని యూఎస్ హతమార్చింది.
అల్ జవహరి కుటుంబంతో సహా కాబూల్లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించేందుకు జో బైడెన్ అమెరికా సైన్యానికి గతవారం అనుమతిచ్చారు. ఆదివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన వారు డ్రోన్ దాడులు చేసి అల్ జవహరిని హతమార్చారు. ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ ప్రాణాలు కోల్పోలేదని బైడెన్ పేర్కొన్నారు. అల్ జవహరి మృతితో 9/11 ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని అన్నారు. ఈజిప్ట్ వైద్యుడిగా పేరొందిన జవహరీ సెప్టెంబర్ 11, 2001న యునైటెడ్ స్టేట్స్లో జరిగిన దాడుల్లో నాలుగు విమానాలను హైజాక్ చేయడంలో కీలక వ్యక్తి. ఈ దాడుల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ)లోని రెండు టవర్లను 2 విమానాలు ఢీకొన్నాయి. కాగా మూడో విమానం అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ అంటే పెంటగాన్ను ఢీకొట్టింది. నాలుగో విమానం షాంక్విల్లేలోని పొలంలో కూలిపోయింది. ఈ ఘటనలో 3,000 మంది చనిపోయారు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోయిన 11 నెలలకే అల్ఖైదా చీఫ్ను అంతం చేయడం ఉగ్రవాదంపై పోరులో అమెరికాకు కీలక విజయమనే చెప్పవచ్చు. అల్ జవహరి మృతితో ఇకపై అప్గానిస్థాన్ ఉగ్రవాదులకు సురక్షితమైన ప్రదేశంగా ఉండబోదని బైడెన్ పేర్కొన్నారు.
అమెరికా తన పౌరులను రక్షించడం కోసమై ఎల్లవేళలా అండగా ఉంటుంది. అదేవిధంగా మాకు హాని కలిగించే వారిపై ప్రతీకారం తీర్చుకునే తీరుతాం. ఉగ్రవాదులు ఎక్కడ దాగి ఉన్నా మేం కనుగొని హతమార్చడానికి ఎంతో సమయం పట్టదని ఈరోజు మళ్లీ రుజువు చేశామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.