అమెరికా ప్రభుత్వ పాలనలో కలకలం రేగుతోంది. కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ కు సన్నిహితుడుగా పేరు తెచ్చుకొన్న ఎలాన్ మస్క్.. పాలక వర్గం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కొంత కాలంగా ఈ విషయంలో దీని మీద రుమార్లు నడుస్తున్నాయి.
ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు. ఇప్పటి దాకా ప్రభుత్వ ఖర్చులను తగ్గించే విభాగానికి ఆయన నాయకత్వం వహించారు. డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు నిర్వహించిన ఎలాన్ మస్క్ వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన ప్రస్థానం ముగిసిందని ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రభుత్వంలో అనవసరపు ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం కల్పించినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ధన్యవాదాలు తెలిపారు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలంగా పనిచేస్తుందన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవి చేపట్టిన తరవాత డోజ్ మిషన్ సారథిగా ఎలాన్ మస్క్ను నియమించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించేందుకు వేలాది ఉద్యోగులను తొలగించారు. ఇందులో మస్క్ జోక్యంపై తీవ్ర విమర్శలు వచ్చినా ట్రంప్ వెనక్కు తగ్గలేదు. దీంతో ట్రంఫ్ టీమ్ లో ఎలాన్ మస్క్ హవాయే నడుస్తుందని అంతా ఊహించారు.
కానీ ఇది మున్నాళ్ల ముచ్చటే అయింది. ట్రంఫ్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఓ బిల్లు విషయంలో ఎలాన్ మస్క్ తొలిసారి స్వరం విప్పారు. ఈ బిల్లుకు బడ్జెట్ కేటాయించాల్సి రావడంతో, ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే ఆశయానికి గండి పడుతుందన్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం డోజ్ ఆశయాలకు తూట్లు పొడుస్తుందని విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్ వైదొలగడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ అనుమానాల మధ్యనే ఎలాన్ మస్క్ బయటకు వచ్చేశారు. దీంతో ట్రంఫ్ విధానాలతో పొసగకే ఆయన బయటకు వచ్చేశారు అంటున్నారు. మరో వాదన ప్రకారం, అమెరికా విధానాల ప్రకారం, బయట నుంచి వచ్చిన అధిపతులకు నిర్దిష్టకాలం ఉంటుంది. ఆ పీరియడ్ ఈ నెల 30 తో ముగుస్తోంది. అందుచేతనే మస్క్ బయటకు వచ్చేశారు అని కూడా అంటున్నారు.