ఎన్నికల ముంగిట యోగీ సర్కారుకు షాక్ తగిలింది. కార్మిక, ఉపాధి శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రైతులు, నిరుద్యోగ యువతపై యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందునే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అదనపు సీటు కావాలని అడిగారని అందుకు పార్టీ నిరాకరించినందునే రాజీనామా చేశాడని బీజేపీ అంటోంది. స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేసిన వెంటనే ఆయనతో కలిసి ఉన్న ఓ ఫోటోను సమాజ్వాదీ పార్టీ నేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ షేర్ చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాటం స్వామి ప్రసాద్ మౌర్యకు స్వాగతం పలుకుతున్నానని అన్నారు.
మౌర్య గత ఎన్నికల్లోనే బీజేపీలో చేరారు. అప్పుడు కూడా బీఎస్పీ టికెట్ నిరాకరించడంతో ఎన్నికలకు ముందు లోక్ తాంత్రిక్ బహుజన్ మంచ్ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. పెద్దగా స్పందన లేకపోవడంతో టికెట్ హామీ తీసుకుని బీజేపీలో చేరారు. గెలిచి యోగీ కేబినెట్లో మంత్రి అయ్యారు. ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు ముందు ఎస్పీలో చేరారు. ఎప్పుడూ ఏదో కారణం చెప్పి స్వప్రయోజనాల కోసం పార్టీలు మారడం మౌర్యకు అలవాటేనని బీజేపీ అంటోంది. నాడు బీఎస్పీ టికెట్లు అమ్ముకుంటోందని ఆరోపించిన మౌర్య ఇప్పుడేమో పార్టీ రైతులు, నిరుద్యోగులను పట్టించుకోవడం లేదంటూ రాజీనామా చేశారు.