యూపీ రైతులకు యోగీ సర్కార్ శుభవార్త తెలియజేసంది. కొత్త సాగు చట్టాలపై ఓ వైపు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యోగీ సర్కార్ రైతుల వద్ద ఉన్న గోధుమలను.. పెరిగిన ఎంఎస్పీ ధర చెల్లించి సేకరిస్తామని పేర్కొంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
యూపీ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు.. గురువారం నాడు ఈ వివరాలను వెల్లడించారు. పెంచిన ఎంఎస్పీ (కనీస మద్దతు ధర) చెల్లించి గోధుమలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి తెలిపారు. ఇందుకోసం మార్చి 1వ తేదీ నుంచే రైతుల పేర్లను నమోదు చేసుకుంటున్నామన్నారు. ప్రస్తుతానికి 30 వేల మంది వరకు రైతులు పేర్లు నమోదు చేసుకున్నారని.. గోధుమల సేకరణ ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు జరుగుతుందని ప్రభుత్వాధికారి తెలిపారు.
కాగా, గోధుమలకు కనీస మద్ధతు ధర గతేడాది క్వింటాలుకు రూ.1925 ఉండగా.. దీనిని రూ.50 పెంచారు. దీంతో 2021-22లో క్వింటాలు గోధుమలకు కనీస మద్ధతు ధర రూ.1975కు చేరింది. అంతేకాదు.. గోధుమల సేకరణకు ఆంక్షలు లేవని.. రైతుల వద్ద ఉన్న గోధుమల నిల్వలు పూర్తిగా సేకరించే వరకు ఈ ప్రక్రియ కొనసాగించనున్నారు. రైతులు ఎంత అమ్మితే అంత మేరకు కొనాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.