మహిళకు పెళ్లి కానంత మాత్రనా అబార్షన్ కు అనుమతిని నిరాకరించలేమని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండి గర్భం దాల్చిన ఓ మహిళ.. తన గర్భాన్ని తొలగించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం పరిధిని అవివాహిత మహిళలకు కూడా వర్తింపజేసింది. సహజీవనం ద్వారా 25 ఏళ్ల మహిళ గర్భం ధరించగా, 24 వారాల వయసు ఉన్న ఆ పిండాన్ని తొలగించడానికి అనుమతి ఇచ్చింది. అబార్షన్ చేసినా ఆమెకు ఎలాంటి ప్రాణహాని లేదని ఢిల్లీ ఎయిమ్స్ ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు చెప్పడంతో ఇందుకు ఓకే చెప్పింది. అబార్షన్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈ యువతి వయసు 25 ఏళ్లు. కొంత కాలంగా ఒకరితో రిలేషన్లో ఉంది. ఈ క్రమంలోనే అవాంఛిత గర్భం దాల్చింది. దీంతో అబార్షన్కు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
పెళ్లికానందు వల్ల ఈ యువతి అబార్షన్ చేయించుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం అలాంటి పరిమితులు ఏమీ లేవని చెప్పింది. ఆ మహిళ అవాంఛిత గర్భాన్ని కొనసాగించాలన్నది చట్టం ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. బిడ్డను కనాలా, వద్దా అని నిర్ణయించుకోవడం ఆమెకున్న హక్కు అని తెలిపింది.