భారత సైనిక అధికారి మేజర్ రాధిక సేన్ కు ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారం లభించింది. మేజర్ రాధిక సేన్ ను 2023 సంవత్సరానికి గాను “మిలిటరీ జనరల్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్” అవార్డుకి ఎంపిక చేశారు. కాంగో దేశం లో శాంతి కోసం, మహిళల హక్కుల కోసం ఆమె ఎనలేని కృషి చేశారు . ఇందుకుగాను ఈ అవార్డుని ప్రదానం చేశారు.
హిమాచల్ ప్రదేశ్ కు చెందిన రాధిక సేన్ బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేశారు. బాంబే ఐఐటి నుంచి మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. 2016లో భారత సైన్యం లో ప్రవేశించి అంచలంచెలుగా ఎదిగారు. ఐక్యరాజ్యసమితి తరపున వివిధ దేశాలలో భారత సైనిక బలగాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో 2023 ఏప్రిల్ లో ఆర్మీ మేజర్ రాధిక సేన్.. కాంగోలో అడుగు పెట్టారు.
మధ్య ఆఫ్రికాలోని రెండవ అతిపెద్ద దేశం డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సుదీర్ఘకాలం బెలిజియం పాలనలో ఉండిపోయిన ఈ దేశం… తర్వాత కాలంలో కూడా మొబుతు అనే నియంత పాలన లో మగ్గిపోయింది. అతని మీద తిరుగుబాటు చేసి అధికారాన్ని రద్దు చేశారు. కానీ ,,ఆ తర్వాత నుంచి విప్లవ గ్రూప్ లో మధ్య పోరాటానికి కాంగో వేదికగా మారిపోయింది. ఈ గ్రూపుల మధ్య అధికారం కోసం పోరాటంలో ప్రజలు నలిగిపోతున్నారు.
ముఖ్యంగా అడవుల్లో ఉండే విప్లవకారులు అకస్మాత్తుగా గ్రామాల మీద దాడులకు దిగుతుంటారు. లైంగిక దాడులు అక్కడ సర్వసాధారణం. ఐక్యరాజ్యసమితి అంచనా మేరకు దాదాపు 30 లక్షల మంది అమ్మాయిలు లైంగిక హింసకు గురైనట్లు తెలుస్తోంది. పేదరికం నిస్సహాయత కారణంగా స్థానిక ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఈ పరిస్థితుల్లో అక్కడ అడుగుపెట్టిన సైనిక అధికారి మేజర్ రాధికాసేన్ చాలా త్వరగా అక్కడ స్థానిక భాషను నేర్చుకున్నారు. ఆ తర్వాత అక్కడ మహిళల్లో ధైర్యాన్ని నూరి పోశారు. విప్లవకారుల పేరుతో దాడులకు దిగితే ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. హింసను ఎలా ఎదుర్కోవాలో కొన్ని ఆత్మరక్షణ చిట్కాలు తెలియజేశారు. కుటుంబ నిర్ణయాల్లో మహిళల పాత్ర ఉండాలంటూ ఆమె ప్రచారం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే కాంగో మహిళలకు ఆమె దైవదూతగా మారిపోయారు.
ఈ విజయాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది . ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్… ఒక ప్రకటన విడుదల చేస్తూ … “కాంగో మహిళలు గొంతెత్తేలా రాధికా సేన్ చేయగలిగారు. శాంతి కోసం ముందుకు వచ్చి పని చేసేలా వారిని ప్రేరేపించారు. ఆమె సేవలు అద్భుతం” అని ప్రకటించారు.