ఈ ఆర్థిక సంవత్సరం కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేశారు.
ఈసారి బడ్జెట్లో 9 అంశాలకు పెద్ద పీట వేశారు. ఏమిటంటే.
* ఉపాధి కల్పన..
* నైపుణ్య శిక్షణ..
* ఎంఎఎస్ఎంఈపై దృష్టి..
* వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు అభివృద్ధికి పరిశోధనలు..
* వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు..
* కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు క్లస్టర్లకు ప్రోత్సాహం..
* స్వయం సమృద్ధి సాధించడం..
* రాష్ట్రాల భాగస్వామ్యంతో వ్యవసాయం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ప్రోత్సాహం..
* ప్రధాన మంత్రి ప్యాకేజీలో భాగంగా ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాలు..
వీటితో పాటుగా కొన్ని అంశాల మీద బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం జరిగింది.
దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానం తీసుకొని వస్తారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల అభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు చేస్తారు. స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వందకు పైగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ శాఖల ఏర్పాటు చేస్తున్నారు. ఏటా లక్ష మంది విద్యార్థులకు ఇ-వోచర్ల ద్వారా మొత్తం రుణంపై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది.
ఈసారి బడ్జెట్లో గ్రామాల ప్రగతి కోసం ప్రాధాన్యత కల్పించారు.
గ్రామీణాభివృద్ధికి రూ. 2.66 లక్షల కోట్లు ఇస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. రొయ్యల
పెంపకం, మార్కెటింగ్ కోసం ఆర్థిక సహాయం అందిస్తారు.
రూ. 26 వేల కోట్ల వ్యయంతో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులు చేపడుతున్నారు. అమృత్సర్-కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్లో, బీహార్ లోని గయాలో పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి సహకారం ఇస్తారు.
విద్యా ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేస్తున్నారు. విద్యార్థులకు రూ. 10 లక్షల వరకూ లోన్ అందిస్తారు. ప్రధాన మంత్రి ప్యాకేజీలో భాగంగా 3 ఉద్యోగ అనుసంధాన ప్రోత్సహకాలను ప్రవేశపెడుతున్నారు. ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ల కోసం మూడు పథకాలు రాబోతున్నాయి. కొత్త ఉద్యోగాల కల్పనలో భాగంగా తొలి నెల జీతం ప్రభుత్వం చెల్లిస్తుంది . కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ చెల్లింపుల్లో మొదటి నాలుగేళ్లు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇక, తొలిసారి సంఘటిత రంగంలోకి ప్రవేశించిన ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లించనున్నారు. గరిష్టంగా రూ.15వేలు చెల్లిస్తారు . నెలకుగరిష్టంగా రూ.లక్ష లోపు వేతనం ఉన్న వారు దీనికి అర్హులు. 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాలను కల్పించి బోతున్నారు.
మొత్తం మీద భవిష్యత్తు భారతాన్ని అద్భుతంగా నిర్మించే దిశగా కేంద్ర బడ్జెట్ ను రూపొందించారు. అన్ని రంగాల్లో వెలుగులు నింపేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అర్థం అవుతోంది.