రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యత దక్కింది. వివిధ అంశాల క్రింద తెలుగు రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. బిహార్, జార్ఖండ్తో పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రత్యేక కార్యక్రమాల్లోనూ ఏపీకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
పూర్వోదయ పథకం కింద ఝార్ఖండ్ ఒడిశా తో పాటు ఆంధ్రప్రదేశ్ కు పూర్తిస్థాయిలో నిధులు అందిస్తామని వివరించారు. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను.. అలాగే
ఉత్తరాంధ్ర జిల్లాలకు… వెనుకబడిన జిల్లాల అభివృద్ధి పథకం కింద ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయం అందిస్తామని చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యంలో అమరాతవతి నిర్మాణానికి రూ.15 కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఈ సంవత్సరంలో పూర్తిగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అవసరాన్ని ఇంకా నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక, వివిధ ఫైనాన్స్ సంస్థల ద్వారా నిధులు సమకూర్చునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు పోలవరం జీవనాడి అని తెలిపారు. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందని వివరించారు.
హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లోని ఓర్వకల్లు మరియు విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ లోని కొప్పర్తి ప్రాంతాల దగ్గర పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. రవాణా, విద్యుత్, ఇంధన, పరిశ్రమల రంగాలలో తెలుగు రాష్ట్రాలకు పెద్ద పేట వేస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ వివరించారు.