కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం ఈ స్కీమ్ తెచ్చిన సంగతి తెలిసింది. మొదటగా ఎయిర్ ఫోర్స్ లో నియామకాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించగా… పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. జూన్ 24 న ప్రక్రియ మొదలు కాగా.. ఇప్పటి వరకు అంటే ఆరు రోజుల్లో ఒక లక్షా 83 వేల దరఖాస్తులు వచ్చాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5 వరకు కొనసాగనుంది.
పదిహేడున్నరేళ్ల వయసు నుంచి 23 ఏళ్ల మధ్య వయస్కులు అగ్నిపథ్ లో చేరడానికి అర్హులు. జూన్ 14న కేంద్రం ఈ పథకం గురించి ప్రకటన చేసింది. మొదట్లో దీన్ని వ్యతిరేకిస్తూ దేశంలో పలుచోట్ల ఆందోళనలు చెలరేగాయి. అయితే కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నియామకాల ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించేసింది. దీంతో అగ్నిపథ్ లో అగ్నివీరులుగా చేరేందుకు యువత ఎంతో ఆసక్తిగా దరఖాస్తు చేసుకుంటోంది.