ఊహించని స్పందన.. 28 రోజులు.. 1000 కోట్లకు పైగానే..
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి జరుగుతున్న నిధి సమర్పణ అభియాన్ విస్తృతంగా జరుగుతోంది. రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఊహించని విధంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మందిర నిర్మాణానికి రూ.1700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా.. ఇప్పటికే రూ. వెయ్యి కోట్ల విరాళాలు వచ్చాయని ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. మకర సంక్రాంతి రోజున ప్రారంభమైన నిధి సమర్పణ అభయాన్ దేశ వ్యాప్తంగా జరుగుతోంది. అన్ని వర్గాల ప్రజలు ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇస్తున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా 1.50 లక్షల మంది వీహెచ్పీ కార్యకర్తలు రామ మందిర నిర్మాణం కోసం నిధులను సమీకరిస్తున్నారని.. అలా సేకరించిన మొత్తాల్ని ట్రస్టు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తున్నారని తెలిపారు. ఇందుకోసం 37 మంది కార్యకర్తలను నియమించామని తెలిపారు. వీహెచ్పీ కార్యకర్తలతో పాటు.. సంఘ్ పరివార్ క్షేత్రాలన్నీ.. ఈ నిధి సమర్పణ అభియాన్లో పాల్గొంటున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి నిధి సమర్పణ అభియాన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని.. భక్తులు ఇష్టపూర్వకంగానే విరాళాలు ఇస్తున్నారని చంపత్ రాయ్ తెలిపారు. రూ.10/-,100/-,1000/- కూపన్ల ద్వారా నిధి సేకరిస్తున్నామని.. గృహ సంపర్క్ చేసిన సమయంలో వారికి కరపత్రం కూడా అందజేస్తున్నామన్నారు.