బౌద్ధ, సిక్కు మతాలపై విద్వేష చర్యలతో పాటు ‘హిందూ ఫోబియా’నూ గుర్తించాలని ఐరాసలో భారత రాయబారి టిఎస్ తిరుమూర్తి స్పష్టం చేశారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ (జిసిటిసి) నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో మాట్లాడుతూ తీవ్రవాదాన్ని అరికట్టేందుకు ఐక్యరాజ్య సమితి ఆమోదించిన వ్యూహం లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు.
సెప్టెంబరు 11 దాడుల అనంతరం ప్రకటించిన ”తీవ్రవాదంపై యుద్ధం” డిక్లరేషన్పై నెలకొన్న అంతర్జాతీయ ఏకాభిప్రాయంతో సాధించిన ప్రయోజనాలు ఇప్పుడు రివర్స్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రవాదానికి ఇచ్చే నిర్వచనంలో కొత్త కొత్త పదాలు చేర్చడం పట్ల భారత ప్రభుత్వం అసౌకర్యంగా భావిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని తీవ్రవాద నిరోధక కమిటీ (సిటిసి)కి ఈ ఏడాదికి భారత్ చైర్మన్గా వుంది. భారత్ పదవిలో వున్నంత కాలం తీవ్రవాదంపై భద్రతా మండలిలో జరిగే చర్చల్లో ఇటువంటి పదాలను చేర్చడాన్ని భారత్ వ్యతిరేకిస్తూనే ఉంటుందని తిరుమూర్తి దీని ద్వారా స్పష్టమైన సంకేతాలిచ్చారు.
మతపరమైన భయాలపై, తిరుమూర్తి మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి వాటిలో కొన్నింటిని సంవత్సరాలుగా ప్రస్తావిస్తూ వస్తున్నదని చెబుతూ అవి ఇస్లామోఫోబియా, క్రిస్టియానోఫోబియా, యాంటిసెమిటిజం – మూడు అబ్రహమిక్ మతాలపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. వీటిని ఇవి గ్లోబల్ కౌంటర్-టెర్రరిజం స్ట్రాటజీలో కూడా ప్రస్తావించిన్నట్లు గుర్తు చేశారు.
ప్రపంచంలోని ఇతర ప్రధాన మతాలపై కొత్త భయాలు, ద్వేషం లేదా పక్షపాతం కూడా పూర్తిగా గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. సమకాలీన మతపరమైన ఫోబియా యొక్క ఆవిర్భావం, “ముఖ్యంగా హిందూ వ్యతిరేక, బౌద్ధ వ్యతిరేక, సిక్కు వ్యతిరేక ఫోబియాలు తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం.
ఈ ముప్పును పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి, అన్ని సభ్య దేశాల దృష్టి అవసరం” అని ఆయన స్పష్టం చేశారు. “గత రెండు సంవత్సరాలలో, అనేక సభ్య దేశాలు, వారి రాజకీయ, మతపరమైన, ఇతర ప్రేరణలతో తీవ్రవాదాన్ని జాతిపరంగా ప్రేరేపించబడిన హింసాత్మక తీవ్రవాదం, హింసాత్మక జాతీయవాదం, మితవాద తీవ్రవాదం మొదలైన వర్గాలుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాయి” అంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు.
“ఉద్భవిస్తున్న బెదిరింపుల” గురించి ప్రస్తావిస్తూ, “అటువంటి చర్యల వెనుక ఉన్న ప్రేరణల ఆధారంగా తీవ్రవాదం, తీవ్రవాదానికి అనుకూలమైన హింసాత్మక తీవ్రవాదాన్ని వర్గీకరించడానికి ఇది ప్రాథమికంగా ఒక ఎత్తుగడ” అని ఆయన ఆరోపించారు.
దీనిని “ప్రమాదకరమైన” ధోరణిగా పేర్కొంటూ, తిరుమూర్తి ఇటీవల ఆమోదించిన గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం వ్యూహంలో అన్ని సభ్య దేశాలు అంగీకరించిన కొన్ని ఆమోదించిన సూత్రాలకు విరుద్ధంగా ఈ ధోరణి ఉన్నదని స్పష్టం చేశారు. ఎటువంటి ఉగ్రవాద చర్యకైనా సమర్ధన ఉండే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
ప్రజాస్వామ్యంలో, రైట్-వింగ్, లెఫ్ట్-వింగ్ ప్రాథమికంగా రాజకీయాల్లో భాగమే అని చెబుతూ ఎందుకంటే వారు మెజారిటీ ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబించే బ్యాలెట్ ద్వారా అధికారంలోకి వస్తారని గుర్తు చేశారు. నిర్వచనం ప్రకారం ప్రజాస్వామ్యం విస్తృతమైన భావజాలాలు, నమ్మకాలను కలిగి ఉంటుందని, అందువల్ల, ప్రజాస్వామ్య భావనకు వ్యతిరేకంగా పోరాడే అనేక రకాల వర్గీకరణలను అందించడం పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని హితవు చెప్పారు.
“నిర్దిష్ట జాతీయ లేదా ప్రాంతీయ సందర్భాలకు పరిమితమైన బెదిరింపులు అని పిలవబడే వాటికి” ఇటువంటి లేబుల్లు ఇవ్వబడుతున్నాయని చెబుతూ, అటువంటి జాతీయ లేదా ప్రాంతీయ కథనాలను ప్రపంచ కథనంలోకి మార్చడం తప్పుదారి పట్టించేది అవుతుందని ఆయన హెచ్చరించారు.
గత రెండు దశాబ్దాలలో, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో గణనీయమైన పురోగతి ఉందని తిరుమూర్తి చెప్పారు. అయితే తాము ఇటీవల వారి పరిధి, వైవిధ్యం, భౌగోళిక ప్రదేశంలో ఉగ్రవాద కార్యకలాపాల పునరుద్ధరణను చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితికి సంబంధించి, ఆఫ్రికాలో తీవ్రవాద, రాడికల్ గ్రూపులు అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయని తిరుమూర్తి హెచ్చరించారు.