మహా రాజకీయం అసోంను చేరిన వేళ ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వాశర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో సంక్షోభానికి బీజేపీ వ్యూహం పన్నిందని రెబెల్ ఎమ్మెల్యేలను గౌహతికి తరలించి ఆతిథ్యం ఇచ్చారన్న శివసేన ఆరోపణల్ని ఆయన తోసిపుచ్చుతూ వ్యంగ్యంగా బదులిచ్చారు. తమ రాష్ట్రానికి రాకుండా ఏ ఒక్కరినీ తాను ఆపబోనని…ఉద్ధవ్ థాక్రే కూడా రావచ్చనీ అన్నారు.
”దేశంలోని ఎమ్మెల్యేలందరినీ అసోంలో పర్యటించమని ఆహ్వానిస్తున్నాను. అలాంటప్పుడు ఒక హోటల్కు వచ్చిన వారిని నేను ఎలా ఆపుతాను. అసోంలోని హోటల్స్కు రావద్దని నేనెలా ఎందుకు అంటాను…దేశంలో సమాఖ్య వ్యవస్థ నడుస్తోంది. అసోంకి ఎవ్వరు వచ్చినా నాకు సంతోషమే. వాళ్లు ఎన్ని రోజులు ఉండాలనుకున్నా ఉండొచ్చు. వెకేషన్ కోసం ఉద్ధవ్ కూడా అసోం రావచ్చు” అని శర్మ అన్నారు.
నిన్న కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు హిమంత. దేశం నలుమూలలనుంచి పెద్దఎత్తున పర్యాటకులు అసోం రావాలని తాము కోరుకుంటామని….ఎవరికైనా సరే రాష్ట్రం ఆతిథ్యమిస్తుందని అన్నారు. అసోం ఎప్పుడూ వరదలతో ఇబ్బందిపడుతుందని.పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందితేనే వరదనష్టాన్ని తాము పూడ్చుకోగలమనీ హిమంత అన్నారు. మహారాష్ట్ర పరిణామాల నేపథ్యంలో విపక్షాలు విమర్శలు పెంచడంతో ఆయనా తగ్గడం లేదు.. ఏకంగా ఉద్ధవే అసోం రావచ్చనీ అన్నారు.