యూటర్న్ ఉద్యమం!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారిక ప్రయాణం ముందుకు బదులు వెనక్కి పోతున్నట్టుంది. రోజుకో యూటర్న్ తో పాలన పీఛే ముడ్ అంటున్నది. తాజాగా ఎల్ ఆర్ ఎస్ విషయంలో యూటర్న్ తీసుకున్నారు కల్వకుంట్ల వారు. ఎల్ ఆర్ ఎస్ రెగ్యులరైజ్ కాకపోయినా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కు సై అన్నారు. ధరణి అనేది ఒక ట్రెండ్ సెటర్ అని ప్రారంభోత్సవం నాడు సీఎం అంటే ఏమిటో అనుకున్నాం. నెలల తరబడి రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడానికి కారణం కావడం ట్రెంట్ సెటరే అని తర్వాత అర్థమైంది. ఎల్ ఆర్ ఎస్ పై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా కెసిఆర్ సర్కార్ పట్టించుకోలేదు. ఇందులో పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత విషయంలో హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నించింది.
ఎల్ ఆర్ ఎస్ పేరుతో దోపిడీ చేస్తున్నది అని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. రియల్టర్లు చేసిన తప్పులకు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టి దోచుకోవడం తగదని ఎంత మంది సూచించినా సర్కారు వినలేదు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ మూడు నెలల తర్వాత మొదలైనా ఈ మెలిక అడ్డంకిగా మారింది. చివరకు ఎల్ ఆర్ ఎస్ ద్వారా రెగ్యులరైజ్ కాని భూముల రిజిస్ట్రేషన్ కు ఓకే అని ప్రభుత్వం చెప్పింది. ఇదేదో ప్రజలమీద ప్రేమతో తీసుకున్న నిర్ణయంలా కనిపించదు. ఇక దిక్కులేని పరిస్థితిలో, ప్రజల నుంచి మరింత వ్యతిరేకత రావద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని కాస్త లాజికల్ గా ఆలోచిస్తే ఎవకైరినా అర్థమైతది.
తెలంగాణ ఎవరి జాగీరు కాదు. నియంత్రిత సాగు పేరుతో కెసిఆర్ రైతుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారు. సన్న రకం వరినే పండించాలని ఒత్తిడి చేసి వాళ్ల ఉసురు పోసుకున్నారు. తీవ్రంగా నష్టపోయిన రైతుకు తగిన ధర ఇవ్వడానికి కల్వకుంట్ల సర్కార్ ముందుకు రాలేదు. రైతులు రోడ్డెక్కినా పట్టించుకోవడం లేదు. దుబ్బాక ఎన్నికలకు ముందు ఒకలా, తర్వాత మరోలా ప్రవర్తిస్తున్నారు. వరదలకు పంట నష్టం జరిగితే పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం మోడీ సర్కార్ తెచ్చిన ఫసల్ బీమాను తెలంగాణలో అమలు చేసి ఉంటే దాని ప్రకారం వరద బాధిత రైతులకు పరిహారం దక్కేది. అది కూడా దూరం చేసిన కెసిఆర్ కు రైతుల ఉసురు తగుగుతుందని ప్రతిపక్ష నేతలు తిట్టిపోస్తున్నారు. ఇప్పటికీ తెలంగాణలో దాదాపు 5 లక్షల మంది రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రకారం ఏడాదికి 6000 రూపాయలు రాకుండా కెసిఆర్ సర్కార్ అడ్డుకుంటోంది. ఎందుకు అని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నా సమాధానం లేదు.
పంట ఉత్పత్తులను రైతులు ఎక్కడైనా అమ్ముకోవడానికి మోడీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కొత్త చట్టం తెచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ మంత్రులు, ఇతర గులాబీ నేతలు ఒకరోజు రహదారులను దిగ్బంధించారు. దాని వల్ల ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. దీన్ని కెసిఆర్ నుంచే వసూలు చేయాలనే వాదనలో పస ఉంది. కానీ అది జరుగుతుందా అనేది ప్రశ్న. మోడీ చట్టాలు కార్పొరేట్లకు కొమ్ముకాసేలా ఉన్నాయని కెసిఆర్ ఆన్నారు. తన ఫాంహౌస్ లో పండించినవి మాత్రం కార్పొరేట్లకు ఎందుకు అమ్ముకున్నారు అంటే జవాబు లేదు.
ధరణి పోర్టల్ పేరుతో కెసిఆర్ మరో విచిత్ర విన్యాసానికి తెరలేపారు. అదొక పనికిమాలిన పోర్టల్ అనే విమర్శలు వచ్చినా ముందుకు పోయారు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. ఇక వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ మూడు నెలలు ఆగిపోయింది. దేశంలో, ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతటి దారుణమైన నిర్ణయాన్ని తీసుకుని ఉండదు. ప్రజల సొమ్ముతో ఒక పాలరాతి భవనాన్ని కట్టించి, దానికి ప్రగతి భవన్ అనే పేరు పెడితే ఆఫీసు అయిపోదు. దేశంలో ఆరేండ్లుగా ఆఫీసుకు పోని ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్. అదే ఈ ప్రజల, రైతుల దౌర్భాగ్యం అన్న విపక్ష నేతల మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింప చేస్తున్నాయి.