కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మారణకాండకు తెగబడుతున్నారు. భద్రతాబలగాలతో తలపడే దమ్ములేక సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. మొన్న కశ్మీరీ పండిట్ అయిన మఖన్ లాల్ బింద్రాను కాల్చి చంపిన టెర్రరిస్టులు ఇవాళ మరో ఇద్దరిని కాల్చి చంపారు. ఉగ్రవాదులు బలితీసుకున్న ఆ ఇద్దరూ ప్రభుత్వ టీచర్లు. వారిలో ఒకరు కశ్మీరీ పండిట్ కాగా…మరొకరు సిక్కు మహిళ. శ్రీనగర్ జిల్లాలోని సంఘం ఈద్గా సమీపంలో ఇద్దరు టీచర్లను చంపేశారు. ఘటనాస్థలాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్న పోలీసులు, భద్రతాబలగాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి.
మంగళవారం కూడా శ్రీనగర్లోని ఇక్బాల్ పార్క్లో ఉన్న ఓ ఫార్మసీ షాపు ఓనర్ 70 ఏళ్ల మఖన్ లాల్ బింద్రూను ఉగ్రవాదులు కాల్చి చంపారు. కశ్మీరీ పండిట్ అయిన బింద్రూ….1990 దశకంలో ఊచకోతలను తట్టుకుని అక్కడే నిలబడ్డాడు. వేర్పాటువాదులు, మతోన్మాదులు ఎంతగా భయపెట్టినా, హెచ్చరించినా తగ్గలేదు. బంధువులు, ఇరుగుపొరుగు ప్రాణాలు అరచేటబట్టుకుని కశ్మీర్ వదిలి పారిపోయినా ధైర్యంగా నిలబడి ఉన్నారు బింద్రా. అక్కడే ఉండి నాటినుంచి ఫార్మసీ షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇకఅదే రోజు జదిబాల్ లో వీధివ్యాపారం చేసుకుంటున్న బిహార్ కు చెందిన వీరేంద్ర పాశ్వాన్ నూ కాల్చేశారు. బండిపొరాలో క్యాబ్ డ్రైవర్ మహ్మద్ షఫీ ని కూడా ముష్కరులు ఆరోజే కాల్చిచంపారు. తీవ్రవాదుల వరుస దాడులతో భద్రతాదళాలు మరింత అప్రమత్తమయ్యాయి. ముష్కరుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అంతకుముందు కూడా భద్రతా బలగాలతో సన్నిహిత సంబంధాలున్నాయంటూ…మాజిద్ మాజీద్ అహ్మద్ గోజ్రా, మహ్మద్ షఫీ దార్ అనే ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు చంపేశారు.