హర్యానా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) సురేందర్ సింగ్ హత్య కేసులో డంపర్ యజమాని సహా మరో ఇద్దరు నిందితులను పోలీసులు నిన్న అరెస్టు చేశారు. నూహ్ జిల్లాలో ట్రక్కు ఢీకొని తౌరు డీఎస్పీ సురేందర్ సింగ్ హత్యకు గురైన కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. నిందితులను పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు.
అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను అర్షద్, సాబీర్ లుగా గుర్తించారు. వీరివురు డంపర్ ట్రక్ యజమానులు. ఇన్వెస్టిగేటింగ్ అధికారి ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ నేతృత్వంలోని నూహ్ క్రైమ్ బ్రాంచ్ బృందం నిందితులిద్దరినీ అరెస్టు చేసింది.
పోలీసులు ఇది వరకే పట్టుకున్న ఇక్కార్, జాబిద్ లను కోర్టులో హాజరుపరచగా, వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఈ కేసులో ప్రధాన నిందితులు షబ్బీర్, తౌఫిక్ లను కూడా నిన్న కోర్టులో హాజరుపరిచారు. షబ్బీర్కు ఒకరోజు రిమాండ్ విధించగా.. తౌఫిక్ను కోర్టు జైలుకు పంపింది.
అక్రమ మైనింగ్ తవ్వకాలపై దర్యాప్తు చేస్తున్న సురేందర్ సింగ్ డంపర్ ట్రక్ ను ఆగమని సూచించిగా నిందితులు ట్రక్కుతో అతనిపైకి దూసుకెళ్లి హత్య చేయడంతో చనిపోయారు.