త్రిపురకు చెందిన ఇద్దరు జర్నలిస్టులు సమృద్ధి సకునియా, స్వర్ణ ఝా లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మతసామరస్యానికి విఘాతం కల్గించేలా తప్పుడు వార్తలను ప్రసారం చేయడమే కారణం. వీహెచ్పీ నేత కంచన్ దాస్ ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.
ఇద్దరూ గౌహతి వెళ్తుండగా…కరీంగంజ్ జిల్లాలో అసోం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు అగర్తలా వెళ్తూ భద్రతాధికారుల తనిఖీకి సహకరించలేదు. దీంతో వారు అసోం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
అమరావతి , మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో ఇటీవలి హింసాత్మక సంఘటనల ఆధారంగా… త్రిపురలో మతపరమైన అల్లర్లకు కొందరు కుట్ర చేస్తున్నట్టు స్పష్టమైందని త్రిపుర పోలీసులు అన్నారు. ఉత్తర త్రిపుర పరిధిలోని ఫాటిక్రోయ్ పీఎస్ పరిధిలోని పాల్ బజార్లో మత విద్వేషాన్ని వ్యాప్తి చేయడంలో వారి ప్రమేయం ఉన్నట్టు తేలిందనీ పోలీసులు తెలిపారు.
అంతకుముందు కూడా “హిందువులకు, త్రిపుర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగం చేశారు” పోలీసులంటున్నారు. పాల్ బజార్లోని మసీదును వీహెచ్పీ, బజరంగ్ దళ్ వాళ్లు ధ్వంసం చేశారని ఇద్దరూ ఆ ప్రాంతంలో ప్రచారం చేశారు. సోషల్ మీడియాలోనూ వైరల్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో త్రిపురలో విధ్వంసం, మతపరమైన ఉద్రిక్తతలకు సంబంధించిన వరుస ఘటనలు వెలుగుచూశాయి.
బంగ్లాదేశ్లో హిందువులపై దాడికి వ్యతిరేకంగా త్రిపురలో VHP నిర్వహించిన నిరసన ర్యాలీలో ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయి. అయితే ఆగొడవల్లో భాగంగా హిందూసంస్థల ప్రతినిధులు మసీదును ధ్వంసం చేశారని ప్రచారం జరిగింది. ఆ వార్త నిజమని పెద్దఎత్తున ముస్లింలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. త్రిపుర పోలీసులు, కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆ వార్తను ఖండించాయి. త్రిపుర అల్లర్లు మహారాష్ట్రకూ పాకాయి. మహారాష్ట్రలోని అకాడమీతో సహా ముస్లిం సంస్థలు ర్యాలీలు నిర్వహించాయి. హిందూ సంస్థలు మసీదును ధ్వంసం చేశాయంటూ పలువురిపై దాడులు చేశారని వార్తలు వచ్చాయి. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మత పరమైన ఉద్రిక్తతలు ప్రేరేపించే తప్పుడు వార్తల్ని వ్యాప్తి చేస్తే కఠిన శిక్షలుంటాయని హెచ్చరిస్తూ హోంమంత్రిత్వ శాఖ ప్రకటన కూడా విడుదల చేసింది. తాజాగా ఆ వార్తల్ని ప్రసారం చేసిన ఇద్దరు జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.