ప్రధాని హత్యకు కుట్రపన్నిన ఇద్దరిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని వాళ్లు కుట్ర పన్నుతూ ఆ కార్యకలాపాల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. జూలై 12న మోదీ పర్యటన సందర్భంగా ఆయన హత్యకు పథక రచన చేసిన ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని అథర్ పర్వేజ్, ఎండీ జలాలుద్దీన్ గా గుర్తించారు. ప్రధాని మోదీ పర్యటనకు 15 రోజుల ముందు అనుమానిత ఉగ్రవాదులు ఫుల్వారీ షరీఫ్లో శిక్షణ పొందారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
జులై 6, 7 తేదీల్లో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేందుకు ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా సమావేశాలు జరిపారు. దీంతో అనుమానిత ఉగ్రవాదులున్న ఫుల్వారీ షరీఫ్ కార్యాలయంలో బీహార్ పోలీసులు దాడులు నిర్వహించారు.కీలక పత్రాలు, ఇతర ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి 25 పీఎఫ్ఐ కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి యువకులు ఉగ్రవాద శిక్షణ తీసుకునేందుకు ఇక్కడికి వచ్చేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది.అరెస్టయిన వీరిద్దరూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీతో సహా పలు ఇస్లామిక్ దేశాల నుంచి భారత దేశ వ్యతిరేక ప్రచారాలు చేసేందుకు డబ్బును పొందేవారని పోలీసులు వెల్లడించారు.