మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ పూర్తిగా ఎలాన్ మస్క్ వశమైంది. 44 బిలియన్ డాలర్లకు ఆయన ట్విట్టర్ ను పూర్తిగా సొంతం చేసుకున్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అది పెద్ద డీల్ అని చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం మస్క్ ఈ ప్రతిపాదన చేశారు. అయితే సుదీర్ఘ చర్చలు జరిపిన బోర్డు మస్క్ కు ట్విట్టర్ ను విక్రయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. తన ప్రతిపాదనకు అంగీకరించకపోతే ప్లాన్ బీ కూడా సిద్ధంగా ఉందని మస్క్ ప్రకటించిన సంగతి తెలిసింది.
ఇక ట్విట్టర్ ను పూర్తిగా మస్క్ విక్రయిస్తున్నట్టు ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ధ్రువీకరించారు. సోమవారం సాయంత్రం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. 44 బిలియన్ డాలర్లకు తమ సంస్థను ఎలాన్ మస్క్కు విక్రయించడానికి అంగీకరించామని ప్రకటించింది. మస్క్ టేకోవర్ ప్రకటనను సమీక్షించి.. చర్చించామని… ఎట్టకేలకు ప్రక్రియ సానుకూలంగా ముగిసిందని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చీఫ్ బ్రెట్ టేలర్ తెలిపారు. కొనుగోలుకు మద్దతుగా మస్క్ ఫైనాన్సింగ్ ప్యాకేజీని ఆవిష్కరించిన నాలుగు రోజుల తర్వాత ఈ ఒప్పందం జరిగింది.
అసలైతే ఈ సోషల్మీడియా జెయింట్ ప్లాట్ఫామ్ను కొనుగోలు చేయడానికి మొదట్లో ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్- 46.5 బిలియన్ డాలర్లు. డీల్ కుదిరే సమయానికి రెండున్నర బిలియన్ డాలర్ల మొత్తం తగ్గింది. ఈ టేకోవర్ వ్యవహారంతో ట్విట్టర్ షేర్ హోల్డర్ల పంట పండినట్టైంది. ఒక్కో షేర్ కు 54.20 డాలర్లు చెల్లించనున్నాడు మస్క్. దాన్ని ఒప్పందంలోనూ పొందుపరిచారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి జేక్ డోర్సీ సహా ట్విట్టర్ బోర్డులో పదకొండు మంది ఉన్నారు. ఎలాన్ మస్క్ ఆఫర్ పై సమగ్ర సమీక్ష, అధ్యయనం జరిపింది. అందుకు జేపీ మోర్గాన్ అండ్ కంపెనీని నియమించుకుంది. వారిచ్చిన నివేదికను సమీక్షించి మస్క్ ఆఫర్ పై ఆమోదముద్ర వేసింది. బోర్డు సభ్యులంతా ఇందుకు ఏకగ్రీవ అంగీకారం తెలిపారు. ఈ బదలాయింపు ప్రక్రియ మూడునెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక విషయం వెలువడిన వెంటనే ట్విట్టర్ల షేర్ల ధరలు పైపైకి వెళ్లాయి. అసలు మస్క్ ప్రతిపాదన నాటి నుంచే న్యూయార్క్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ లో ట్విట్టర్ షేర్ల ధరలు పెరుగుతూ వచ్చాయి.
ట్విట్టర్ నుంచి అధికారిక ప్రకటన రాగానే మస్క్ ఓ ప్రకటన చేశారు. ట్విట్టర్ మరింతగా తీర్చి దిద్దుతానని. ప్రజాస్వామ్యానికి భావ ప్రకటనా స్వేచ్ఛ పునాదివంటిదని తాను నమ్ముతాననీ వ్యాఖ్యానించారు. మరిన్ని ఫీచర్లను తీసుకొస్తానని చెప్పారు. ఇకపై డిజిటల్ టౌన్ స్క్వేర్ గా మార్చి…స్వేచ్ఛగా డిబేట్లు జరిగేలా మార్పులు తెస్తాననీ అన్నారు. ‘నాపై దారుణమైన విమర్శలు చేసేవాళ్లు కూడా ట్విటర్ లో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అదే నిజమైన వాక్ స్వాతంత్ర్యం’అంటూ ట్వీట్ చేశారు మస్క్.అటు ట్విట్టర్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి, పరాగ్ అగర్వాల్ స్వాగతించారు. ఇకపై వినియోగదారులకు మరింత అనుకూలంగా ట్విట్టర్ వేదిక ఉంటుందని చెప్పారు.
https://twitter.com/elonmusk/status/1518677066325053441?s=20&t=ahjhclSnsF1wuybU1n6G8Q