కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్కు మధ్య వార్ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా.. ఇష్టారీతిగా వ్యవహరిస్తుండటంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ట్విట్టర్కు కేంద్ర ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు ఆ సంస్థ భారత్కు చెందిన అధికారులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా సంకేతాలిచ్చింది. 1,178 ఖాతాలను బ్లాక్ చేయాలని తాము గతంలో జారీ చేసిన ఆదేశాలకు సంస్థ పట్టించుకోకపోవడంపై స్పందిస్తూ.. తమ సహనం నశిస్తోందని సర్కార్ అనడం చూస్తుంటే.. ట్విట్టర్ సంస్థపై సర్కార్ ఆగ్రహంతో ఉందని అర్ధమవుతోంది. సంస్థ అంతర్గత చట్టాలు ఏవైనా ఉన్నప్పటికీ.. భారతదేశ చట్టాలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.
కాగా, ట్విటర్ సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. భారత్లో రాజ్యాంగం, స్థానిక చట్టాలే సుప్రీం అని.. బాధ్యతాయుత సంస్థలు వాటిని కచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే స్పష్టం చేసింది. ట్విటర్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ మోనిక్ మెచె, డిప్యూటీ జనరల్ కౌన్సిల్ జిమ్ బేకర్లతో ఐటీ శాఖ కార్యదర్శి వర్చువల్ మీటింగ్ ముగిసిన తర్వాత ఈ ప్రకటన జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో గతకొద్ది రోజులుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుండగా.. వీటికి సంబంధించి పాక్,ఖలిస్తాన్కు చెందిన 1,178 ట్విట్టర్ అకౌంట్లు తప్పుడు ప్రచారాన్ని వైరల్ చేస్తున్నాయని కేంద్ర సర్కార్ ట్విట్టర్ సంస్థకు తెలిపింది. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించినప్పటికీ.. ట్విటర్ సంస్థ మాత్రం కేవలం 500 అకౌంట్లనే బ్లాక్ చేసింది. మిగతా అకౌంట్లను భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అలాగే ఉంచింది.