తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డు వివాదం మీద సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోట్లాది భక్తులకు మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో, ఈ దర్యాప్తును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సంయుక్తంగా పాలుపంచుకోవాలని సూచించింది. ఈ విషయం మీద సిబిఐ దర్యాప్తు అవసరం అని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ
పిటిషనర్లతో పాటు టీటీడీ, కేంద్ర ప్రభుత్వ వాదనలు పరిగణలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం ఐదుగురు సభ్యులతో విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఇద్దరు సీబీఐ, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారితో సిట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బృందాన్ని సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని తెలిపింది.
కానీ పిటీషనర్ల అసలు డిమాండ్ కు సుప్రీంకోర్టు నో చెప్పింది. ఈ కమిటీని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించడానికి ధర్మాసనం విముఖత చూపింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలచుకోలేదని తీవ్ర స్థాయిలో మండిపడింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది. తిరుమల వ్యవహారంలో రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేయడానికి అనుమతించమని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా మరోసారి సుప్రీంకోర్టు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పవిత్రతను గుర్తు చేసింది. ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఏమాత్రం అమోదయోగ్యం కాదని జస్టిస్ గవాయ్ విచారణ సందర్భంగా పేర్కొన్నారు. దర్యాప్తు చేసిన తర్వాత దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తామని ధర్మాసనం ప్రకటించింది. సొలిసిటర్ జనరల్ సైతం స్వతంత్ర దర్యాప్తు చేపడితేనే ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగు చూస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ధర్మాసనం తీర్పు వెలువడక ముందు.. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు ఎదుట కీలక అంశాలు ప్రస్తావించారు. ‘‘తిరుమల లడ్డూ వ్యవహారం మొత్తాన్ని పరిశీలించాను. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవు. సిట్పై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారు. సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే.. రాజకీయ జోక్యం ఉండదు’’ అని తుషార్ మెహతా అన్నారు.
ఈ వాదనలు అన్నింటినీ సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకున్నది. ఉమ్మడి గా స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.