యూపీ నోయిడాలో అక్రమంగా నిర్మించిన 40అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేతకు ముహూర్తం నిర్ణయమైంది.ఆగస్టు 21న వాటిని కూల్చివేస్తున్నట్టు నోయిడా అథారిటీ అధికారులు తెలిపారు. అసలైతే మే 22నే ఆ బిల్డింగ్స్ ను కూల్చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు మరో మూడునెలలు గడువుపెంచుతూ ఆగస్ట్ 28కల్లా కూల్చివేయాలని అధికారులను ఆదేశించింది.
నోయిడా సెక్టార్ 93లో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ 2009లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసింది. అయితే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లాన్ చూపకపోవడంతో పాటుపలు నిబంధనలూ ఉల్లంఘించింది నిర్మాణ సంస్థ. అధికారులూ యాజమాన్యంతో కుమ్మక్కైనట్టు తేలింది. దీంతో పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అందులోని 915 ప్లాట్లు, 21 దుకాణాలు కొనుగోలు చేసిన అందరికీ 12శాతం వడ్డీతో మొత్తాన్ని చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు తీర్పు మేరకు మే 22నే కూల్చేయాల్సి ఉండగా ఎప్రిల్ లోనే టెస్ట్ బ్లాస్ట్ కూడా చేశారు. అయితే టవర్స్ అనుకున్నదానికన్నా దృఢంగా ఉన్నట్టు కూల్చివేత బాధ్యత తీసుకున్న ఎడిపైస్ సంస్థ కోర్టుకు తెలిపింది.ఈ భారీ నిర్మాణాల కూల్చివేతకు కనీసం 4వేల కిలోల పేలుడు పదార్దం అవసరం పడుతుందని అంచనా. 9 సెకన్లలో మొత్తం కూల్చాలని సంస్థ చూస్తోంది. దీనివల్ల చుట్టుపక్కల ఇళ్లకు హానీ జరిగితే బీమా కల్పిస్తామని నోయిడా అథారిటీ తెలిపింది.