తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యానికి టీటీడీ పెద్దపీట వేస్తోంది. కార్యనిర్వాహణాధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయిస్తున్నారు. పాత జమాన లోని లోపాలను సరిదిద్దుతూ భక్తులకు టీటీడీ సేవలను దగ్గర చేస్తున్నారు. తిరుమలకు వచ్చే యాత్రీకుల అవసరాలు లక్ష్యంగా పలు వ్యవస్థలలో మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పలువురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు, మెమోలు జారీ చేయడమే కాక కొందరు డెప్యూటేషన్ అధికారులను మాతృ సంస్థకు పంపించే కార్యక్రమాన్నీ కూడా ప్రారంభించారు.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే తిరుమలేశుని దర్శించుకోడానికి గత నెలలో తిరుమలకు వచ్చిన చంద్రబాబు ఇక్కడినుంచే ప్రక్షాళన మొదలు పెడుతున్నట్టు ప్రకటించారు. ఆ క్రమంలోనే సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి శ్యామలరావు ను టీటీడీ కార్యనిర్వహణాధికారిగా నియమించారు. విధుల్లో చేరిన వెంటనే విస్తృతంగా పర్యటనలు మొదలు పెట్టిన శ్యామల రావు ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.
తిరుమలలో రద్దీ సమయంలో భక్తులకు నామమాత్రంగా అందుతున్న అన్న ప్రసాదాలు, పాలు వంటి వాటిపై దృష్టి సారించారు. క్యూలైనులలో వేచివుండే భక్తులకు నిరంతరాయంగా నీళ్లు, పాలు, అన్న ప్రసాదాలు అందించాలని ఆదేశాలను జారీ చేశారు.అదేవిధంగా పారిశుధ్యం విషయంలో తనిఖీలు జరిపి తగు ఆదేశాలు జారీ చేసి చక్కదిద్దే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో విధినిర్వహణ కు సంబంధించి పలువురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు, మెమోలు కూడా జారీ చేశారు. దర్శనం పరమైన సమస్యలను గుర్తించిన శ్యామల రావు శ్రీవారి మెట్టు మార్గం గుండా వచ్చే వారికి దివ్య దర్శనం టోకెన్లు ఇచ్చే ప్రక్రియను పునః ప్రారంభించారు.
ఇటీవలి కాలంలో తిరుమలేశుని దివ్య ప్రసాదం లడ్డూల విషయంలో వస్తున్న నాణ్యతా పరమైన అంశాలను చక్కదిద్దడానికి అటు వస్తువులను సరఫరా చేసే వ్యాపారులతో, ఇటు లడ్డూలను తయారు చేసే బ్రాహ్మణులతో సమావేశాలు నిర్వహించి లోపాలను సరిద్దిద్దడం ప్రారంభించారు. అన్నిటినిమించి ప్రభుత్వం నుంచి టీటీడీ కి డెప్యూటేషన్ పై వచ్చిన అధికారుల పనితీరు పై దృష్టి ని సారించిన శ్యామల రావు అవసరాన్ని బట్టి కొనసాగించాలా వద్దా అనే అంశంపై చర్యలు మొదలు పెట్టారు. తాజాగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా ) వైస్ చైర్మన్ గా పని చేస్తూ కొన్ని నెలల కిందటే టీటీడీకి డెప్యూటేషన్ పై వచ్చిన హరికృష్ణ ను వెనక్కు పంపించివేశారు. మరి కొందరిని కూడా పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తం మీద టీటీడీ పరిపాలన యంత్రాంగంలో కొత్త ఈవో భారీ మార్పులు చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రజలకు దగ్గర అయ్యే మార్గాల్లో సిబ్బందిని ఉపయోగిస్తున్నారు.