అతి త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించున్నారని సమాచారం. డిసెంబరు తొలివారంలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. దీపావళి తర్వాత వెంటనే నోటిఫికేషన్ వెలువడనుంది. మొత్తానికి 16 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దుబ్బాక ఎన్నికల ఫలితంతో ప్రభుత్వానికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. మొదట్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జనవరి చివరివారం, లేదంటే ఫిబ్రవరిలో ఉంటాయనుకున్నారు అంతా. కానీ సీన్ రివర్స్ అయ్యింది. దుబ్బాకలో తమకు వ్యతిరేకంగా ఫలితం రావడంతో గ్రేటర్ పై కూడా ఆ ఎన్నికల ప్రభావం ఉంటుందని పడుతుందని టీఆర్ఎస్ సర్కార్ భావించింది. గెలుపు ఆనందంలో ఉన్న బీజేపీకి తామే మరో ఛాన్స్ ఇవ్వకూడదని వెంటనే జీఎహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటోంది.
గడిచిన ఆరేళ్లలో చవిచూసిన మొట్టమొదటి అపజయంతో టీఆర్ఎస్ కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యం నుంచి బయట పడేయడంపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. గట్టి విజయంతో దుబ్బాక ఓటమికి బదులివ్వడమే సరైన పరిష్కారంగా భావిస్తోంది. ఇందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలను వేదిక చేసుకోవాలనుకుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గడిచిన ఆరేళ్లలో జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అప్పడే నగరాన్ని ఫెక్సీలు, హోర్డింగ్లతో ముంచెత్తుతున్నారు. ఇక వరద సహాయక చర్యలు, మరమ్మతులను వేగంగా పూర్తి చేయడంతోపాటు, ఎక్కువ మంది ప్రజలు కోరుకునే పనులకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
అందులో భాగంగానే ప్రజలు ఇబ్బందిగా భావించే గుంతల పూడ్చివేత, గతుకుల రోడ్లకు అతుకులు వేసే ప్రక్రియ పరుగులు పెడుతోంది.
గత ఎన్నికల్లో 99 స్థానాల వద్ద ఆగిపోయిన నేపథ్యంలో ఈసారి సెంచరీ దాటాలనే పట్టుదలతో ఉన్నట్లు టీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. జీహెచ్ఎంసీలో ఈసారి వంద డివిజన్లు నెగ్గాలన్నది టీఆర్ఎస్ లక్ష్యం. మరోవైపు దుబ్బాకకు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధం లేదు అనేది వారి వాదన. ప్రస్తుతం హైదరాబాద్ జనాభాను టీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల వరద బాధితులకు ఇంటికి రూ.10వేల చొప్పున సాయం అందించిన విషయం తెలిసిందే. దాని వల్ల అధికార పార్టీకి మేలు జరుగుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇక గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ మొత్తం 16 రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణకు వారం రోజుల సమయం ఉంటుంది. అనంతరం ప్రచారానికి వారం మాత్రమే సమయం ఉంటుంది. జనవరిలో జరిగిన డబీర్పుర ఉప ఎన్నికనూ 16 రోజుల్లోనే పూర్తిచేశారు. ఇప్పుడే అదే షెడ్యూల్తో ఎన్నికలను పూర్తి చేస్తారని సమాచారం.