ఖజానా ఖల్లాస్!
తెలంగాణ తిరోగమిస్తున్నది. ఆరున్నరేళ్ల తర్వాత ధనిక రాష్ట్రం కాస్తా దరిద్రానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. సుపరిపాలన సాధ్యం కాని పాలకుల కారణంగా మద్యం మినహా ప్రతి విషయంలోనూ తిరోగమనమే. చివరకు ప్రజారోగ్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ చెల్లింపుల విషయంలోనూ నిర్లక్ష్యం, లేదా చేతకాని తనం కనిపిస్తుంది. అందుకేనేమో ఆయుష్మాన్ భారత్ కు జైకొట్టింది కెసిఆర్ సర్కార్. పేదలకు ఏడాది 5 లక్షల రూపాయల వరకు ప్రయివేటు దవాఖానాల్లో కూడా ఉచిత వైద్యం చేయించుకోవడానికి మోడీ ప్రభుత్వం తెచ్చిన అద్భుతమై పథకం ఆయుష్మాన్ భారత్. కానీ ఇంతకాలం కెసిఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని తెలంగాణలోని రానివ్వలేదు. మా ఆరోగ్యశ్రీయే భేష్ డబ్బా కొట్టుకుంది. కానీ కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చలేదు. ఆయుష్మాన్ భారత్ లో కరోనా చికిత్సకు అవకాశం ఉన్నా ముఖ్యమంత్రి మొండిగా వ్యవహరించి పేదలకు న్యాయం జరగకుండా అడ్డం పడ్డారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో చేరుతామంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం నాడు కేంద్రానికి తెలిపారు.
ఇంతకాలం తెలంగాణ ప్రజలకు ఈ పథకాన్ని దూరం చేసినందుకు కెసిఆర్ క్షమాపణ చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇన్నాళ్లు ప్రజలకు ఈ ఫలం దక్కకుండా చేశాని తప్పయింది అని కెసిఆర్ అంటారని అనుకోలేం. ఆయన వ్యవహార శైలి తెలిసిన చిన్పపిల్లలకు కూడా ఈ సంగతి తెలుసు. సన్న వడ్ల పేరుతో రైతుల ఉసుకు పోసుకున్నా పాప పరిహారం గానీ, పశ్చాత్తాపం గానీ కెసిఆర్ లో లేషమాత్రమైనా కనిపించడం లేదు. కనికరం లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఏళ్ల తరబడి ఆలస్యం కావడంతో ప్రయివేట కార్పొరేట్ ఆస్పత్రులు తరచూ ఈ చికిత్సను నిలిపివేయడం మామూలే. అలా జరిగినప్పుడు నామ్ కే వాస్తే కొంత మొత్తం విడుదల చేయడం, తర్వాత మళ్లీ షరా మామూలే. యూటర్న్ లు, ప్రజలు అన్యాయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, నిర్వాకాలతోనే పాలన నడుస్తున్నది.
గుజరాత్ తర్వాత సంపన్న రాష్ట్రం మనదే అని 2014లో సీఎం కెసిఆర్ చెప్పినప్పుడు తెలంగాణ ప్రజలు సంబరపడ్డారు. కొట్టాది తెచ్చుకున్న రాష్ట్రం ధనికంగా అవిర్భవించినందుకు గర్వపడ్డారు. కేవలం ఆరున్నర ఏళ్లలో ఇది ఇప్పుడు దివాళా అంచున కనిపిస్తోంది. బీద తెలంగాణగా గోచరిస్తున్నది. కరోనా పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలల పాటు జీతంలో సగం కోత విధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ధనిక తెలంగాణ దౌర్భాగ్యం అందరికీ బాధ కలిగించింది. ఇప్పుడు ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడం వెనుక కూడా ఖజానా ఖాళీ అనే సంకేతాలనే ఇస్తున్నది. లక్షల మంది ఉద్యోగులు 58 ఏళ్లకే రిటైర్ అయితే వాళ్లకు బోలెడన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి. కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం అమలు అవుతున్న కారణంగా ప్రతి ఒక్కరికీ భారీగానే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అసలే ఖజానా ఖాళీ. ఆరోగ్యశ్రీ, విద్యార్థుల స్కాలర్ షిప్పులు, రైతు రుణ మాఫీ వంటి వాటికే కష్టంగా ఉంది. కాబట్టే రిటైర్మెంట్ వయసు పెంచారనేది ఒక వాదన. ఖజానా పరిస్థితి తెలిసిన వారికి ఇది నిజమే అనిపించడం సహజం. వేల కోట్ల రూపాయల మద్యం ఆదాయం వస్తున్నా చాలడం లేదు. బెల్ట్ షాపులను పెంచడం ద్వారా ప్రజలకు మద్యం తాగించడమే లక్ష్యం అన్నంత దారుణమైన పరిస్థితి బహుశా మరే రాష్ట్రంలోనూ లేదేమో.