కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎంగిలి మెతుకులకు ఆశపడి.. సొంత వ్యాపార ఆర్థిక లావాదేవీల కోసం.. కాంట్రాక్టుల కోసం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిపోతున్నారంటూ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ (BJP) అసలు స్వరూపాన్ని చూపిస్తోంది. లోక్సభ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ అవహేళన చేశారు. ఈడీ బీజేపీకి ఎలక్షన్ డిపార్ట్మెంట్గా మారింది. ఈడీ ద్వారా అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ను వేధిస్తున్నారని అన్నారు. మోదీ, అమిత్ షాలు ఈడీ దాడులతో కాంగ్రెస్ ను వేధిస్తుంటే.. కన్నకొడుకులా పోరాటం చేయాల్సిన సమయంలో రహస్య ఒప్పందాలు చేసుకొని పార్టీ మారుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా మునుగోడులో ఉప ఎన్నికకు కాంగ్రెస్ సిద్ధమైందని ప్రకటించారు. ఈ నెల 5న మునుగోడు నియోజకవర్గంలో సమావేశంతో ఎన్నికల శంఖారావం పూరిస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశానికి ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా సీనియర్ నాయకులంతా పాల్గొని మునుగోడు ప్రజల గుండె చప్పుడును వింటారన్నారు. మునుగోడులో మోదీ, అమిత్ షా గుండెలు అదిరేలా తీర్పు ఇప్పిస్తామని అన్నారు. ‘వ్యాపారాలు చేసుకునే రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించిందని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులను ముందుండి నడిపిస్తారని ప్రకటించారు.