టాలీవుడ్ సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్ట్కు గురైన కృష్ణను హుటాహుటిన కాంటినెంటల్ హాస్పిటల్కి తరలించారు. వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమంగానే ఉందని… 48 గంటలు దాటితే కానీ ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఇవాళ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామన్నారు. ఆ లోగానే ఆయన తుదిశ్వాస విడిచారు. వయోభారం వల్ల వచ్చే చిన్నచిన్న ఇబ్బందులు తప్ప ఆయనకు పెద్దగా ఆరోగ్యసమస్యలేం లేవు. ఈ మధ్యే వరుసగా తన రెండో భార్య విజయ నిర్మల, పెద్ద కుమారుడు రమేశ్ బాబు, మొదటిభార్య ఇందిరాదేవి వెంటవెంటనే చనిపోయారు. ఇండస్ట్రీలో తనకెంతో ఆప్తుడైన రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా దూరమయ్యారు. వయోభారంతో పాటు వరుస దెబ్బలు ఆయన్ని కుంగదీయడంతో ఆ ప్రభావం ఆయన ఆరోగ్యంపైనా పడిందని వైద్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 1943 మే 31న కృష్ణ జన్మించారు.ఆయన అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. ఇంజినీర్ అవ్వాలనుకుని ఇండస్ట్రీకి వచ్చారు.తేనెమనసులు చిత్రంలో సినీరంగప్రవేశం చేసిన ఆయన…350 కి పైగా సినిమాల్లో నటించి… తెలుగు సినీ అభిమానుల హృదయంలో నిలిచిపోయారు.
మొట్టమొదటి సినిమా స్కోప్ (అల్లూరి సీతారామరాజు), మొట్టమొదటి ఈస్ట్మన్ కలర్ (ఈనాడు), మొట్టమొదటి 70ఎంఎం (సింహాసనం), మొట్టమొదటి కౌబాయ్ చిత్రం (మోసగాళ్లకు మోసగాడు).. ఇలా ఎన్నో రికార్డులు ఆయన సొంతం. పద్మాలయా స్టూడియోస్ అధినేతగా, నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించారు. ఎందరో కొత్త దర్శకులను రంగానికి పరిచయం చేశారు. కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు రమేశ్, మహేశ్ బాబు.. ముగ్గురు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని.
తరువాత రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన 1989లో కాంగ్రెస్ తరపున గుంటూరునుంచి ఎంపీగా పోటీచేసి గెలిచారు.అయితే తన మనస్తత్వానికి రాజకీయాలు సరిపడవని గ్రహించారు. అదే సమయంలో తనను ప్రోత్సహించిన రాజీవ్ గాంధీ హత్యకు గురికావడంతో రాజకీయాలు దూరమయ్యారు.
తెలుగు సినీరంగంలో తనదైన ముద్ర వేసిన నటశేఖరుడు ఇక లేరనే వార్తతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణవార్త తెలిసి సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి చెందారు. ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.