విశ్వగురువు స్థానం పొందిన కృష్ణమూర్తి
– గాఢమైన నమ్మకాలు విచిత్రమైన నిర్దాక్షిణ్యాన్ని కలిగి ఉంటాయి..
– ఏదైనా సొంతం కాగానే ప్రేమ పోతుంది..
ఇలాంటి ఆణిముత్యాలు ఒక గ్రంథంతో సమానం. ఇలాంటి అత్యున్నత దర్శనాన్ని తన మాట ద్వారా అందించిన తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి అనే ఒక కుగ్రామంలో 11 మే 1895న కృష్ణమూర్తి జన్మించారు. చిన్ననాడే కృష్ణమూర్తిని దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షురాలు డా॥అనిబిసెంట్ దత్తతగా స్వీకరించి లోకగురువును చేస్తాను అన్నది. ఆయనను ఒక అవతార పురుషుడిగా సిద్ధం చేసేందుకు 1911లో ‘‘స్టార్ ఆఫ్ ద ఈస్ట్’’ అనే సంస్థను స్థాపించారు. కానీ 1922లోనే కృష్ణమూర్తికి కొన్ని అనిర్వచనీయ అనుభవాలు కలిగాయి. దాంతో దివ్యజ్ఞాన సమాజం ఆలోచనకు భిన్నంగా ఆయన వ్యవహరించారు. 1929 నాటికి కుండబద్దలు కొట్టారు. తనకున్న ఒకే ఒక ధ్యేయం ‘మనిషిని నిర్నిబద్ధంగా, సంపూర్ణంగా విముక్తుణ్ణి చేయడమే’ అని స్పష్టం చేశారు. అనాటి నుండి సుమారు అరవై ఏళ్లపాటు, అంటే 1986 వరకు కాలికి బలపం కట్టుకొని తిరిగారు. తన ప్రబోధం కొనసాగించారు. తాను గురువునని చెప్పుకోకుండానే విశ్వగురువుల్లో ఒకరిగా కీర్తించబడ్డారు. తన పరిధులకు అతీతంగా మానవజీవన మూల్యాలను అందించిన తత్వఖని జిడ్డు కృష్ణమూర్తి.
కృష్ణమూర్తి స్వీయజ్ఞానమే మానవ జీవనమార్గంగా ప్రబోధం కొసాగించారు. ఫ్రీడం ఫ్రం ద నోన్, ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడం, బియాండ్ వాయిలెన్స్, కామెంటరీస్ ఆన్ లివింగ్, కృష్ణమూర్తి ఆన్ ఎడ్యుకేషన్, కృష్ణమూర్తి ఫర్ బిగెనర్స్.. వంటి ఆయన ప్రబోధ గ్రంధాలు మానవాళి స్వీయ మిముక్తికి దర్శనాలు. ఇవి నిత్యనూతన సత్య వచనాలు. మనుషుల్లో ప్రతివారూ తమకు తాము బంధాలు ఏర్పరుచుకొని, గీతలు గీసుకొని వాటి మధ్య జీవిస్తూ ఎవరికి వారే ఇతరుల తప్పులను వ్రేలెత్తి చూపుతుంటారు. అందుకే కృష్ణమూర్తి ‘‘తన స్వభావం తీరు తెన్నులు తెలుసుకోకుండా సత్యం గాని, ఆనందం గాని లభించదు’’ అని ఒక్క మాటలో తేల్చేశారు. ఇవాళ కొందరు ఇహలోకంలో భోగవస్తువులతో ఆనందం పొందాలనే కోరికతో ఉంటే, మరికొందరు పరలోకంలో జరిగే అద్భుతాలను తలచుకొని పాపాలు, దుర్మార్గాలు చేస్తుంటారు. ‘‘ఈ లోకంలో గానీ, ఇంకోచోట గానీ ప్రతిఫలం చూపుతానన్న వాళ్లను కాస్త కనిపెట్టి ఉండండి’’ అన్న హెచ్చరికను పాటిస్తే ఇపుడున్న సంఘర్షణ నుండి ప్రపంచం బయటపడి శాంతిగా ఉంటుంది.
చాలామందిలో ఉండే సాత్విక అహంకారం తామస అహంకారం కన్న తక్కువేం కాదు. ఎన్నోసార్లు అది మనుషులపై పరోక్షంగా పెత్తనం చేస్తుంది. ‘సాత్విక స్వభావం కలవారు’ అని ముద్ర వేసుకొన్న ఇటువంటివాళ్లు బయట అనేక వేషాలు ప్రదర్శిస్తారు. అందుకే కృష్ణమూర్తి ‘‘నిరాడంబరత, నైర్మల్యం మనస్సుకు సంబంధించినవి కావు’’ అంటారు. మనం రోజూ ఎన్నో మాట్లాడతాం, అనవసరమైన విషయాల్లో దూరిపోయి ప్రక్కవాడి ఆలోచనలను మనం ప్రభావితం చేయాలని చూస్తుంటాం. అందువల్ల మనమూ శాంతి కోల్పోతాం. అలాగే ఎప్పుడూ ఏదో తగ్గిందని బాధపడుతుంటాం. అనవసర చింతలకు బాధపడుతూ వ్యర్థ ప్రసంగాలకు మురిసిపోతుంటాం. దాన్నే కృష్ణమూర్తి ‘‘వ్యర్థ ప్రసంగం, వ్యాకులతా ఒకలాంటివే. రెండూ మనస్థిమితం లేకపోతే వచ్చేవే’’ అన్నారు. ఇలాంటి ఆలోచనా ధారలు ప్రవహింపజేయడం, మనస్సును పరుగెత్తకుండా తత్వమార్గం వైపు మళ్లించడం వంటివి తత్వవ్తేతగా కృష్ణమూర్తి చేశారు. ఎన్నో దేశాల మేధోశూన్యతను తన భావధారతో నింపిన శుద్ధ సాత్విక తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. ఆయన బోధలు సదా ఆచరణీయం.
– డా.పి.భాస్కరయోగి