అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు ముఖ్యంగా చిట్ట చివరి వర్గాలైన సామాన్య ప్రజలకు కూడా అందాలి అని ఆకాంక్షించిన మహనీయుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ. దేశ చరిత్రలో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోదగిన మహనీయులలో ఆయన ఒకరు. ఈరోజు అంటే సెప్టెంబర్ 25 వ తేదీ ఆయన జయంతి. ప్రతి సంవత్సరం, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని, ఆయన జీవితం, వారసత్వాన్ని గుర్తుచేసుకోవడానికి అంత్యోదయ దివస్ జరుపుకుంటున్నాము. అంత్యోదయ దివస్ సమాజంలోని చివరి వ్యక్తిని ఉద్ధరించాలనే దృక్పథాన్ని, లక్ష్యాన్ని దేశ ప్రజల ముందుంచుతుంది. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని గౌరవించే రోజుగా 2014లో అంత్యోదయ దివస్ను మొదటిసారిగా పాటించారు.
దీన్ దయళ్ జీ జీవితం మొత్తం సామాన్య ప్రజల కోసమే అంకితం చేశారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25న రాజస్థాన్లోని ధంకియా గ్రామంలో జన్మించారు. మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో తన తండ్రి భగవతీ ప్రసాద్ను, ఎనిమిదేళ్లకు ముందే తల్లిని కోల్పోయారు. కాన్పూర్లోని సనాతన్ ధర్మ కళాశాలలో చదువుకొన్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు.
కళాశాలలో సైతం విస్తారంగా పుస్తకాలు చదువుతూ అధ్యయనం చేసేవారు.
ఉపాధ్యాయుడిగా అర్హత సాధించినా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టలేదు. బదులుగా, 1942 నుండి ఆర్ఎస్ఎస్ లో పూర్తి సమయం పనిచేసేందుకు తనను తాను అంకితం చేసుకుంటూ ప్రచారక్ గా వచ్చారు.
దీనదయాళ్ ఉపాధ్యాయ ఉన్నతమైన ఆదర్శవాదం ఉన్న వ్యక్తి. సంస్థాగత సామర్థ్యం కలిగి ఉన్నారు. ఆయన “రాష్ట్ర ధర్మ” అనే మాసపత్రికను, ‘పాంచజన్య’ వారపత్రికను, ‘స్వదేశ్’ దినపత్రికను ప్రారంభించారు. 1951లో, డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ను స్థాపించినప్పుడు, దీనదయాళ్ దాని ఉత్తర్ ప్రదేశ్ శాఖ కు మొదటి ప్రధాన కార్యదర్శి అయ్యారు.
తదుపరి జనసంఘ్ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు.
జన సంఘ్ విస్తరణలో దీన్ దయాళ్ జీ పాత్ర ప్రముఖమైనది.
దీనదయాళ్ నిర్మాణాత్మక విధానాన్ని విశ్వసించారు. ప్రభుత్వం సరైనది అయినప్పుడు దానికి సహకరించాలని, తప్పు చేసినప్పుడు నిర్భయంగా వ్యతిరేకించాలని ఆయన ఉద్బోధించారు. ఆయన అన్నింటికంటే దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు.
దీనదయాళ్ ఉపాధ్యాయ ఫిబ్రవరి 1, 1968 తెల్లవారుజామున రైలులో ప్రయాణిస్తుండగా అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు.
దీనదయాళ్ ఉపాధ్యాయ్ సామాన్యుల అభ్యున్నతి కోసం ఎన్నో రచనలు చేశారు. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం పని చేయడమే రాజకీయాల లక్ష్యం అని ఆయన భావించారు.
దీన్ దయాళ్ స్ఫూర్తికి మూలం పేద, నిస్సహాయ, సంప్రదాయాలకు కట్టుబడిన సామాన్యుడు. శతాబ్దాల విదేశీ దురాక్రమణను, దుష్పరిపాలనను తట్టుకుని, దేశం ఆత్మను సజీవంగా ఉంచింది సామాన్య ప్రజలే అని విశ్వసించేవారు. తన రాజకీయ ప్రకటనలలో చాలా వరకు దేశ భవిష్యత్తు ఈ సామాన్యుడి చేతుల్లోనే ఉందని, ఆధునిక వాస్తవాలను అతనికి పరిచయం చేయడం చాలా అవసరమని భావించేవారు.
1967లో తన అధ్యక్ష ప్రసంగంలో శక్తి లేని వారికి మద్దతునిస్తూ ఒక బలమైన వ్యక్తీకరణతో ముగించారు. “ప్రతి దేశస్థుడు మన రక్తంలో రక్షం, మన మాంసంలో మాంసం. మనం ప్రతి ఒక్కరిలో తాము భారతమాత పుత్రులం అనే గర్వకారణం కావించేవరకు మనం విశ్రమించము. మనం సుజలం, సఫలం మాటల నిజమైన అర్థంలో భారతమాతను సేవిస్తాము”. బహుశా అదే ఆయన చివరి సందేశం, ఆశయం, ఉపదేశం.
దీన్ దయాళ్ జీ సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. సమాజంలోని ఫలాలు అన్ని వర్గాలకు అంతిమస్థాయి దాకా వెళ్లడంలో మనమంతా చొరవ తీసుకోవాలి.