కాంగ్రెస్కు చురక పెట్టిన మోదీ.. మన్మోహన్ సింగ్ చెప్పారు.. నేను చేస్తున్నా..!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళనల గురించి ప్రత్యేంకగా చెప్పక్కర్లేదు. ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రైతు సంఘాలతో పాటు.. పలు ప్రతిపక్ష పార్టీలు కూడా ఆందోళన చేపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో రైతులు చేస్తున్న ఆందోళనలపై స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ యూ టర్న్ గురించి ప్రస్తావించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను రాజ్యసభలో ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను సమర్థించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలను.. ముఖ్యంగా కాంగ్రెస్కు చురకలంటించారు. గతంలో ప్రతి సర్కార్ వ్యవసాయ రంగంలో సంస్కరణల గురించి మాట్లాడిందని.. అనంతరం పలు పార్టీలు యూ-టర్న్ తీసుకున్నాయని విమర్శించారు.
రైతులు చేపడుతున్న ఆందోళనల గురించి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దాడి చేయడం బాగానే ఉంది కానీ.. అదే సమయంలో అభివృద్ధి చెందాలంటే మార్పు కూడా తప్పనిసరి అని రైతులతో చెప్పాలంటూ ప్రతిపక్షాలకు మోదీ బోధించారు. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని మన్మోహన్ గతంలో చెప్పిన విషయాలను సభలో గుర్తుచేశారు. ప్రతిపక్షాలు (కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ) నా మాట వినకపోయినా ఆయన (మన్మోహన్ సింగ్) మాటైనా వింటారు కదా అని మోదీ అన్నారు. రైతులకు ఓ స్వేచ్ఛాయుత మార్కెట్ అవకాశం కల్పించాలని, భారత్ను ఓ పెద్ద కామన్ మార్కెట్గా చేయాలని మన్మోహన్ సింగ్ గతంలోనే అన్నారని.. ఆ దిశగా ఉన్న వెళ్లేందుకు ఇప్పుడు ఉన్న అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఒక రకంగా మీరు గర్వపడాలి.. మన్మోహన్ సింగ్ చెప్పిన అంశాన్ని మోదీ చేస్తున్నారని అంటూ కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ఎంఎస్పీ థా.. హై.. రహేగా
కనీస మద్దతు ధర ఎప్పటికీ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ.. రైతు పంటకు కనీస మద్దతు ధరను కల్పిస్తామన్నారు. ఎంఎస్పీ గతంలో కూడా ఉండేదని, ఎంఎస్పీ ఇప్పుడు కూడా ఉందని, ఎంఎస్పీ భవిష్యత్తులో కూడా ఉంటుందని స్పష్టం చేశారు. రైతులు వెంటనే ఆందోళనలను విరమించుకోవాలని.. చర్చలకు తాము ఎప్పుడూ రెడీగానే ఉన్నామన్నారు. గతంలో కూడా ఈ విషయాన్ని చెప్పానని, ఇప్పుడు కూడా మరోసారి ఈ విషయాన్ని చెబుతున్నట్లు తెలిపారు.