తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వారం రోజుల క్రితం దాకా తిరుమల కొండ మీద ఓ మోస్తరు ఖాళీ కనిపించింది. ప్రతిరోజు 50 నుంచి 60 వేల మంది దర్శనం చేసుకునేవారు. సహజంగానే ఎండాకాలంలో భక్తుల సంఖ్య కాస్త తగ్గుతుంది.
మే నెల రెండవ వారం వచ్చేసరికి చాలా ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో పిల్లలతో సహా తల్లిదండ్రులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయలుదేరారు. మరోవైపు వేసవి సెలవులు ముగిసే లోగా తిరుమల యాత్ర చేసుకొనేందుకు ఏర్పాటు చేసుకున్నారు. అటు తమిళనాడు కర్ణాటక నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో అన్ని రకాల సిఫార్సు లేఖలను టీటీడీ దేవస్థానం నిలిపివేసింది. ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోవడంతో .. సిఫార్సు లేఖలను అనుమతిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఎమ్మెల్యే టికెట్ మీద ఆరుగురికి, ఎంపీ టికెట్ మీద 12 మందికి ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. సిఫార్సు లేఖలు కూడా అందుబాటులోకి వచ్చేసాయి దీంతో సిఫార్సు లేఖలు తీసుకుని పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు ఫలితంగా తిరుమల కొండ కిటకిటలాడుతోంది.
తిరుమలలో రెండు రోజుల పాటు శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సుమారు 3కిలోమీటర్ల మేర క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు క్యూ కొనసాగుతోంది.
వీరికి శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోందని తితిదే ప్రకటించింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు.
ఇక శని, ఆదివారాల్లో ఈ రద్దీ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వారాంతపు సెలవులు కావడం తో. .. భక్తుల తాకిడి అధికం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.