తిరుమలలో భక్తులకు మరిన్ని అధునాతన సౌకర్యాలు లభించబోతున్నాయి దర్శనం వసతి పర్యాటకం వంటి అంశాలలో అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు త్వరలోనే తిరుమల కొండ మీద రోబోల సేవలను ప్రారంభిస్తున్నారు దీంతో ఖచ్చితమైన, సునిశితమైన ఫలితాలు ఉంటాయని టీటీడీ అంచనా వేస్తోంది.
………..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తి తో టీటీడీ టెక్నాలజీ మీద కసరత్తు చేస్తోంది. తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం టెక్నాలజీకి పెద్దపీట వేస్తుండడంతో టీటీడీ కూడా అటువైపు ప్రయాణం ముమ్మరం చేస్తున్నది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలోని దిగ్గజ కంపెనీలు తిరుమల కు సేవలందించేందుకు ముందుకు వస్తున్నాయి. శ్రీవారి సేవలో తాము పని చేస్తామని ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి ఈ సేవలను ఉపయోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది.
………
తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలకు శ్రీకారం చుడుతున్నారు.
అలిపిరి మరియు శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా మాత్రమే తిరుమలకి భక్తులు ప్రతిరోజూ వస్తుంటారు అందుచేత ఆ పాయింట్ల దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన వీడియో కెమెరాలు అమరుస్తారు. వీటి సహాయంతో ప్రతిరోజు కొండ మీదకు వచ్చే భక్తుల ముందుగానే అంచనా వేయవచ్చు. ఏఐ టెక్నాలజీ కెమెరాలు కావడంతో నిత్యం వచ్చే దేవస్థానం ఉద్యోగులు, పోలీసు, ప్రెస్ సిబ్బందిని వేరుగా గుర్తించేందుకు వీలవుతుంది. దీంతో భక్తుల సంఖ్య స్పష్టంగా తెలిసిపోతుండడంతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లను మార్చుకోవడానికి వీలవుతుంది అప్పుడు రద్దీని గణనీయంగా తగ్గించడానికి సాధ్యపడుతుంది.
………
భక్తుల రద్దీ తగ్గించేందుకు కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
తిరుమలలో భక్తులను కంపార్ట్మెంట్లలో ఉంచుతారు. ఇకనుంచి
ప్రతీ కంపార్ట్ మెంట్ వద్ద ఏఐ కెమేరాలను ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటికే జియో సంస్థ ప్రయోగాత్మకంగా ఫేషియల్ రికగ్నిషన్ ముఖ చిత్రాలను నమోదు చేస్తోంది. ఏఐ సేవల కోసం ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీ కేటాయించనున్నారు. అదే ఐడి ద్వారా అన్ని రకాల సేవల్ని అందించగలుగుతారు.
………
భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం అందించటమే తొలి ప్రాధాన్యత గా టీటీడీ గుగూల్ తో ఒప్పందానికి సిద్దమైంది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఉచితంగా అందించేలా గుగూల్ ఇప్పటికే తమ సంసిద్దత వ్యక్తం చేసింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించి ఈ మేరకు కసరత్తు పూర్తి చేస్తారు.
దర్శనం, వసతి కల్పనలో ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నా… భక్తులకు సమాచారం అందించేందుకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ ఇకనుంచి వివిధ మార్గాలలో భక్తులకు ఏఐ సేవలు అందబోతున్నాయి. దర్శన విధి విధానాలు, వస్త్రధారణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల గురించి ఏఐ సాయంతో యాత్రికులు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి సౌలభ్యం కోసం వారికి కావాల్సిన భాషల్లో సమాచారం అందించనున్నారు.
……………..
శాంతిభద్రతలు విషయంలో కూడా వీటి ఉపయోగం చాలా ఎక్కువ. తిరుమల అంతటా ఏఐ కెమేరాలను గుగూల్ ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా ఎవరైనా అనుమానితులు ఉంటే పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది గుర్తించేందుకు ఉపకరిస్తుంది.
దళారులకు అడ్డుకట్ట వేసేందుకు ఏఐ మేలు చేస్తుందని భావిస్తున్నారు.
……….
ఇక, ఏఐ విధానం అమల్లో భాగంగా ఒక్కో భక్తుడికి శాశ్వత ఐడీ నెంబర్ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో ఆ భక్తుడు ఆ ఐడీ ద్వారానే దర్శనం, సేవలు, గదుల బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎవరు ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు, ఎన్ని గదులు తీసుకున్నారనే పూర్తి సమాచారం టీటీడీ వద్ద ఉంటుంది. అటు భక్తులకు కూడా టీటీడీ సేవల్ని తీసుకోవడం తేలికగా మారుతుంది.
………
మొత్తం మీద డిజిటల్ టెక్నాలజీ ద్వారా తిరుమలలో భక్తులకు అనేక సౌకర్యాలు అందబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి నాయకులు తిరుమల విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల స్ఫూర్తితో టీటీడీ భక్తులకు అనేక సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది.