ముంబైలో ముస్తాబైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ బీజేపీ, బజరంగదళ్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యేలు సహా పాల్గొన్న నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జి చేయడంతో ఉద్రిక్తం నెలకొంది.
మల్వానీలో ఇటీవలే పునరుద్ధరించిన క్రీడా సముదాయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని నిర్ణయించారు. మలాడ్ వెస్ట్ లోని మాల్వానీలో ఉన్న గ్రౌండ్ టిప్పు సుల్తాన్ గ్రౌండ్ గానే అందరికీ తెలుసు. మాల్వాని నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత, కేబినెట్ మంత్రి అస్లాం షేక్ తన ఎమ్మెల్యే అభివృద్ధి నిధులతో మైదానంలో పునరుద్ధరణ పనులు చేపట్టి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి.
అయితే టిప్పు పేరు పై బీజేపీ నిరసన తెలుపుతోంది. పెద్దసంఖ్యలో హిందువుల మరణానికి కారణమైన వ్యక్తి పేరును గ్రౌండ్ కు పెడితే ఊరుకోబోమని దేవేంద్ర ఫడ్నవిస్ హెచ్చరించారు.
అయినా నాయకులు వెనక్కి తగ్గకపోవడంతో బీజేపీ, బజరంగ దళ్ ఆందోళనకు పిలుపునిచ్చింది. నిరసనలో పాల్గొన్న కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో నిరసనకారులు రోడ్డుపై బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు.
ఎంపీ గోపాల్ శెట్టి, ఎమ్మెల్యే , వ్యాపారవేత్త మంగళ్ ప్రభాత్ లోధా సహా బజరంగదళ్, బీజేపీకి చెందిన 64 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ గొంతు నొక్కుతున్నారని… ముస్లింల ఓట్ల కోసం ప్రభుత్వం… ప్రాంగణానికి టిప్పు సుల్తాన్ పేరు పెడుతున్నారని మండిపడ్డారు. అంతే కాదు గత కొన్నేళ్లుగా మాల్వానీ నుంచి హిందువులను తరిమికొట్టే కుట్ర జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఆ ప్రాంతంలో క్రమంగా హిందువుల జనాభా తగ్గుతోందని ఆధారాలతోచెబుతున్నారు.